ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

గల్ఫ్‌ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమతున్నాయి.


ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 160 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని, కనీసం 35 మంది మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు (0300 GMT) అధికారులకు నివేదించినట్లు మేజర్ జనరల్ ఈద్ రషెద్ హమద్ చెప్పారు.

‘అగ్నిప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. చాలా మందిని రక్షించాం.. కానీ దురదృష్టవశాత్తు మంటలు బాగా వ్యాపించడం.. దట్టమైన పొగ అలుముకోవడంతో వల్ల చాలా మంది మరణించారు’ అని మరొక సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.

అగ్నిప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు నివేదించిన 35 మరణాలకు అదనంగా నలుగురి మరణాలు ఉన్నాయా .? లేదా..? అనేది స్పష్టంగా తెలియలేదు.

మృతుల్లో ఐదుగురు భారతీయులు..

మంటలను అదుపు చేశామని, దానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.