తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పై కేంద్ర ప్రభుత్వం వరాలను కురిపించింది. కొత్తగా తొమ్మిది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయించగా.. వీటిలో మెజారిటీ రైళ్లు ఈ రెండు రాష్ట్రాలకే దక్కాయి.
ఇందులో నాలుగు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు రాకపోకలు సాగిస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైళ్ల రూట్లను జాబితాను కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
1. అస్సాంలోని కామాఖ్య నుండి హర్యానాలోని రోహ్ తక్ వరకు
2. అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (గోమతీ నగర్) వరకు
3. పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గురి నుండి తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు
4. పశ్చిమ బెంగాల్ లోని న్యూ జల్ పాయ్ గురి నుండి తమిళనాడులోని నాగర్ కోయిల్ వరకు
5. పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ దార్ నుండి ఎస్ఎంవీటీ బెంగళూరు వరకు
6. పశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ దార్ నుండి ముంబై పన్వెల్ వరకు
7. పశ్చిమ బెంగాల్ కోల్ కత సంత్రాగచ్చి నుండి తాంబరం వరకు
8. హౌరా నుండి ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు
9. కోల్ కత సియాల్దా నుండి బనారస్ వరకు రాకపోకలు సాగిస్తాయి.
వీటిలో- న్యూ జల్ పాయ్ గురి తిరుచిరాపల్లి ఎక్స్ ప్రెస్ ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, చిదంబరం, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు వంటి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
సంత్రాగచ్చి- తాంబరం ఎక్స్ ప్రెస్.. ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై ఎగ్మోర్ వంటి ప్రధాన జంక్షన్లలో ఆగుతుంది.
మూడో ఎక్స్ ప్రెస్ కు ఓ ప్రాముఖ్యత ఉంది. రైల్వే నెట్వర్క్లోని అత్యంత పొడవైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. న్యూ జల్ పాయ్ గురి నుంచి తమిళనాడు చిట్టచివర ఉన్న నాగర్కోయిల్ ను కనెక్ట్ చేస్తుందీ రైలు. ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పొల్లాచ్చి, ఉడుమాల్ పేట, పళని, దిండిగల్, మధురై, విరుధునగర్, సత్తూరు, కోవిల్పట్టి, తిరునల్వేలి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.



































