టెలికాం రంగం ఎప్పటికప్పుడు అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీకి అనుగుణంగా నిరంతరం అప్డేట్ అవుతున్నాయి టెలికాం కంపెనీలు. వినియోగదారులకు సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పుడు టెలికాం రంగంలో మరో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాయి కంపెనీలు. హెచ్డీ వాయిస్, వోల్ట్ హెచ్డీ సర్వీసులపై మార్పులకు నాంది పలికాయి. ఎయిర్టెల్, జియో కంపెనీలు దీనిపై తొలి ముందడుగు వేయగా.. రాబోయే రోజుల్లో అన్నీ కంపెనీలు ఈ బాట పట్టే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పటివరకు కేవలం జియో టూ జియో లేదా ఎయిర్టెల్ టూ ఎయిర్టెల్ మధ్య కాల్ మాట్లాడితే మొబైల్లో హెచ్డీ లేదా వోల్ట్ హెచ్డీ గుర్తులు కనిపించేవి. కానీ ఇప్పుడు జియో టూ ఎయిర్టెల్ లేదా ఎయిర్టెల్ టూ జియో నెట్వర్క్స్ కాల్స్ మాట్లాడిన ఆ గుర్తులు కనిపిస్తున్నాయి.
హెచ్డీ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఏంటి..?
హెచ్డీ కాల్ అంటే సాధారణం కంటే వాయిస్ స్పష్టత క్లియర్గా ఉంటుంది. గతంలో వేర్వేరు నెట్వర్క్లకు కాల్స్ చేస్తే పాత ఇంటర్కనెక్ట్ సిస్టమ్ ఉండటంతో వాయిస్ క్వాలిటీ తక్కువగా ఉండేది. కానీ ఇప్పడు జియో, ఎయిర్టెల్ మధ్య ఏ నెట్వర్క్కి కాల్ చేసినా హెచ్డీ వాయిస్ ఫీచర్ కనిపిస్తుది. దీని వల్ల వినియోగదారులకు కాల్స్ స్పష్టంగా వినిపిస్తుంది.వ్యక్తి మన ముందు మాట్లాడుతున్నట్లు హెచ్డీ కాల్స్లో పిచ్ మరింత వినపడుతుంది.
దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే ఏమవుతుంది..?
ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే వేర్వేరు నెట్వర్క్లకు కాల్ చేసినా కాల్ స్పష్టంగా, సహజంగా వినిపిస్తుది. అంతేకాకుండా ఫోన్ కూడా వేగంగా కనెక్ట్ అవుతుంది. ఇక 2జీ లేదా పాత నెట్వర్క్లలో కాల్ డ్రాప్స్ ఉండవు. గత వారం రోజులుగా ఎయిర్టెల్, జియో మధ్య కాల్స్ చేసుకున్నవారికి ఈ ఫీచర్లు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఈ రెండు కంపెనీలు సైలెంట్గా కొత్త ఫీచర్ను టెస్టింగ్ చేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

































