ఈ జాతరలో తొలిసారిగా ఇప్పపువ్వు లడ్డు భక్తులకు అందుబాటులోకి వచ్చింది. గిరిజన మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారు చేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డులకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.మేడారం జాతర వేదికగా జనవరి 13న మంత్రి సీతక్క ఇప్పపువ్వు లడ్డు విక్రయ స్టాల్స్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 18వ తేదీన మేడారం వేదికగా జరిగిన మంత్రుల క్యాబినెట్ సమావేశంలోనూ ఇప్పపువ్వు లడ్డులను సీం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు అధికారులకు పంపిణీ చేశామని ఇప్పుడు మేడారం పరిసరాలలో 10 స్టాల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఒక బాక్స్ లో 250 గ్రాములతో 150 రూపాయలకు అందుబాటులో ఉంటుందని, తమకు ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యంగా తమకు సహకరిస్తున్న మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారికి, డిఆర్డిఏ అధికారులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా
గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగానే ఇప్పపువ్వు లడ్డు తయారీ ద్వారా గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం ద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటుచేసి వీరికి రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఉట్నూర్ ఐటిడీఏ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇప్పపువ్వు లడ్డు తయారీ, క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు:
ఇప్పపువ్వు లడ్డు తినడం ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇప్పప్పు లడ్డు తినడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పోషకాలు ఎంతగానో మేలు చేసి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ మెరుగుపడడం రోగ నిరోధక శక్తిని పెంచడం గుండె కొలెస్ట్రాల్ తగ్గించడం అధిక శక్తిని పొందడం బరువు నియంత్రణ తో పాటు డయాబెటిస్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. పూర్వకాలంలో ఆదివాసి గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు ముందుగా ఉపయోగించేవారని ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపించడం ద్వారా పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు.

































