వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో వైసిపి నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలోనే వెళ్లాలని సూచించింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. రోడ్డు కిరువైపులా భారీగా బారులు తీరారు. జగన్ రాక నేపథ్యంలో రెంటపాళ్ల జనసంద్రంగా మారింది. భారీ గజమాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ అభిమాన నేతకు ఆహ్వానం పలికారు. 6 గంటలపాటు ఆలస్యంగా పర్యటన ప్రారంభం అయినా జనం మాత్రం అలానే ఉన్నారు. దారి పొడవునా జనం కనిపించారు. రెండు కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల పాటు సమయం పట్టింది.
పోలీసుల ఆంక్షలు..
మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలు విధించారు పోలీసులు. వందమందితో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని.. కాన్వాయ్ లో కూడా పరిమిత వాహనాలు ఉండాలని ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలు ఏవి జగన్ పర్యటనలో కనిపించలేదు. బైకులతోపాటు కార్లలో భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) శ్రేణులు జగన్ వెంట అనుసరించాయి. జగన్ పై ఉన్న అభిమానాన్ని పోలీసుల ఆంక్షలు అడ్డుకోలేకపోయాయి. దారి పొడవునా పోలీస్ శాఖ 25 చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. అయినా సరే జనం ఆ చెక్పోస్టులను దాటుకొని జగన్మోహన్ రెడ్డిని అనుసరించడం కనిపించింది.
చెక్పోస్టులు దాటుకుని..
సత్తెనపల్లి ( sattenapalle )నుంచి రెంటపాళ్ల వరకు ఎటు చూసినా జనమే కనిపించారు. అయితే అంతకుముందు భారీ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇటువంటి తరుణంలో మాజీమంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పల్నాడు సరిహద్దుల్లో భారీ ఎత్తున బారికేడ్లు పోలీసులు ఏర్పాటు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాటిని లెక్కచేయలేదు. ఇసుకేస్తే రాలనంత జనం మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.
































