ప్రముఖ సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (69) శుక్రవారం రాజ్యసభలోకి అడుగుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తమిళంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. తమిళంలో కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తోటి పార్లమెంటు సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్.. కమల్హాసన్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులందరికీ కమల్హాసన్ నమస్కారం చేసి వెళ్లారు.
రాజ్యసభలో ప్రమాణం చేసేందుకు కమల్హాసన్ శుక్రవారం తెల్లవారుజామున పార్లమెంట్ సముదాయానికి చేరుకున్నారు. రాజకీయ ప్రస్థానం నుంచి ఇప్పుడు పెద్దల సభలోకి అడుగుపెట్టడం ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. మొదటిసారి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటీవల డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కమల్హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. చాలా గర్వంగా.. గౌరవంగా ఉందని తెలిపారు.
జూన్ 12న కమల్ హాసన్తో సహా మరో ఐదుగురు తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యుల్లో డీఎంకేకు చెందిన కవి సల్మా (ఎ రొక్కయ్య మాలిక్), ఎస్ఆర్ శివలింగం, పి విల్సన్ (రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు), ఏఐఏడీఎంకెకు చెందిన ఐఎస్ ఇంబాదురై, ధనపాల్ ఉన్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్హాసన్ పార్టీ 2.62% ఓట్లను సాధించింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
































