ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
శుక్రవారం ఒంగోలులో రెవెన్యూ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ అమరావతి జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ఏడు నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, రెవెన్యూ కార్యాలయాల భవనాలు అధ్వానంగా ఉన్నాయని, నూతన భవన నిర్మాణాలకు అనుమతులు కూడా ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ కార్యదర్శి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
































