పర్ల నార్మలైజేషన్ ప్రక్రియపై డీఎస్సీ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షలో వేర్వేరు మాధ్యమాల పేపర్లకు ఒకేరకంగా నార్మలైజేషన్ చేయడంవల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల్లో భాగంగా జూన్ 12న స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్ష జరిగింది. ఉదయం సెషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 20,254 మంది రాశారు.
మధ్యాహ్నం తెలుగుతో పాటు కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ మీడియంలకు కలిపి పరీక్ష జరిగింది. 15,608 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. కాగా, రెండు సెషన్లలో తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాయడంతో అందరికీ కలిపి మార్కులు నార్మలైజేషన్ చేశారు. దీంతో మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు ఏకంగా ఐదారు మార్కులు పెరిగాయని చెబుతున్నారు.
ఒకే మీడియం అభ్యర్థులకు కలిపి నార్మలైజేషన్ చేయాలని, ఇలా వేర్వేరు మీడియంలకు చెందిన పేపర్లను కలిపి చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డిని వివరణ కోరగా.. నిబంధనల ప్రకారమే నార్మలైజేషన్ చేశామని తెలిపారు. వేర్వేరు మీడియంలు అయినా కలిపి నార్మలైజేషన్ చేయవచ్చన్నారు. దీనిపై అభ్యర్థుల నుంచి వినతులు అందాయని, కానీ వారి వాదన సమంజసం కాదని తెలిపారు.
































