ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. అలాంటి నాయకుడి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోదీ కాన్వాయ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన కార్లు
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రత దేశానికి అత్యంత ప్రాధాన్యం. ఆయన కాన్వాయ్లో ఉండే కార్లు కేవలం విలాసవంతమైన వాహనాలు మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన సాంకేతిక కోటలు అని చెప్పొచ్చు. ప్రతి కారులో ప్రత్యేకమైన రక్షణా ఫీచర్లను జోడించారు. ఆ కార్లకు సంబంధించిన విశేషాలు మీకోసం.
మెర్సిడెస్-మేబాచ్ S650 గార్డ్
2021లో మోదీ కాన్వాయ్లో చేరిన అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక భద్రత కలిగిన కారు మెర్సిడెస్-మేబాచ్ S650 గార్డ్. ఈ కారు అంచనా ధర సుమారు రూ. 12 కోట్లు. VR10 ప్రొటెక్షన్ రేటింగ్ – ప్రపంచంలోనే అత్యధిక బుల్లెట్ ప్రూఫ్ స్థాయి. AK-47 తూటాలు, హ్యాండ్ గ్రెనేడ్ పేలుళ్లు, 15 కిలోల TNT బాంబును తట్టుకోగలదు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, బ్లాస్ట్ ప్రూఫ్ ఛాసిస్, ఇంటర్నల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ వంటి ఫీచర్లతో ఇది నిజమైన “కదిలే కోట”గా నిలుస్తుంది.
రేంజ్ రోవర్ సెంటినెల్
మోదీ తరచుగా ప్రయాణించే మరో ప్రధాన వాహనం రేంజ్ రోవర్ సెంటినెల్. ధర దాదాపు రూ. 10 కోట్లు ఉంటుంది. 5.0-లీటర్ సూపర్చార్జ్డ్ V8 ఇంజిన్తో 375 bhp శక్తిని ఇస్తుంది. పేలుళ్లు, తుపాకీ కాల్పుల సమయంలోనూ భద్రత కల్పిస్తుంది. టైర్లు దెబ్బతిన్నా 100 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం. బురద, రాళ్లు, దారుణమైన రోడ్లపై కూడా దూసుకెళ్లగలదు.
BMW 7 సిరీస్
ప్రధాని కాన్వాయ్లో చాలా కాలంగా కొనసాగుతున్న భద్రతా వాహనం BMW 7 సిరీస్. బాంబులు లేదా క్షిపణులను 500 మీటర్ల దూరం నుంచే గుర్తించే సెన్సార్లను అందించారు. AK-47 దాడులు, హ్యాండ్ గ్రెనేడ్ పేలుళ్ల నుంచి కూడా ఈ తట్టుకోగలదు. పంక్చర్-ప్రూఫ్ టైర్లు, అత్యవసర ఆక్సిజన్ ట్యాంక్ వంటి అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మోదీ కాన్వాయ్ ప్రత్యేకత
ప్రధాని మోదీ కాన్వాయ్లోని ప్రతి వాహనంలో బుల్లెట్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ ఉంది. వీటితో ఆయన భద్రత పటిష్ఠం అవుతోంది. ఆధునిక సాంకేతికత, అద్భుత రక్షణా ఫీచర్లతో ఈ కార్లు, ప్రపంచ నాయకుల కాన్వాయ్లలో అత్యుత్తమంగా నిలుస్తున్నాయి.
































