పేటీఎం యూపీఐ ఇకపై అందుబాటులో ఉండదని గూగుల్ ప్లే నుంచి వచ్చిన నోటిఫికేషన్ వినియోగదారులలో భయాందోళనలను సృష్టించింది. ఆగస్టు 31 నుంచి యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయని గూగుల్ ప్లే హెచ్చరికను జారీ చేసింది.
దీనిపై కంపెనీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది.
విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని కంపెనీ.. పేటీఎం యూపీఐ సేవలు మూతపడే దశలో ఉన్నాయని వస్తున్న నివేదికలు తప్పుదారి పట్టించేవని స్పష్టం చేసింది. యూజర్లు పేటీఎంలో యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు ఎటువంటి అంతరాయం ఉండదు. వినియోగదారులకు.. వ్యాపార లావాదేవీలు రెండూ సజావుగా జరుగుతాయి అని కంపెనీ తెలిపింది.
నిజానికి ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోర్ వంటి పునరావృత చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. ఒక యూజర్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లకు పేటీఎమ్ యూపీఐ చేస్తున్నట్లయితే.. అలాంటి వారు.. తమ పాత @paytm హ్యాండిల్ను.. బ్యాంక్కి లింక్ చేసిన కొత్త హ్యాండిల్కి (@pthdfc, @ptaxis, @ptyes, @ptsbi) మార్చవలసి ఉంటుంది.
ఉదాహరణకు మీ యూపీఐ ఐడీ rajesh@paytm అయితే.. అది ఇప్పుడు rajesh@pthdfc లేదా rajesh@ptsbi అవుతుంది. అంటే బ్యాంకు పేరు కూడా చివరి వస్తుందన్నమాట. దీనివల్ల లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కలగదు.
ఈ అప్డేట్ ఎందుకంటే?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి పేటీఎంకు అనుమతి ఇచ్చిన తర్వాత, కొత్త UPI హ్యాండిల్స్కు మారడంలో భాగంగా ఈ అప్డేట్ జరిగింది. ముఖ్యంగా.. కొత్త నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ బిల్లింగ్ సజావుగా సాగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.
































