ఈపీఎస్-95 పెన్షనర్లకు దీపావళి కానుక దక్కనున్నట్లు సమాచారం. ఈపీఎఫ్ఓ నుంచి కనీస పెన్షన్ పెంపు భారీగా ఉండనున్నట్లు చర్చ జరుగుతోంది.
దీపావళికి ముందు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పెన్షనర్లకు పెద్ద బహుమతిని ఇచ్చే అవకాశం ఉంది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వరుస పండుగల నేపథ్యంలో ఉద్యోగ వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 1995లో ఉద్యోగ పెన్షన్ పథకం -95 (ఈపీఎస్-95) ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద నెలకు కనీసం రూ.వెయ్యి పెన్షన్ను అందిస్తోంది. ఈ పింఛన్ పెంపు దశాబ్దాలు గడిచినా అదే స్థాయిలో ఉంది. ఇప్పటివరకు పెరగలేదు. మూడు దశాబ్దాలు గడిచిన అనంతరం ఇప్పుడు కనీస పింఛన్ పెరిగే అవకాశం ఉంది. ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని 11 సంవత్సరాలుగా సవరించలేదు. ఈపీఎస్-95 పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-ఈపీఎఫ్ఓ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అక్టోబర్ రెండో వారంలో బెంగళూరులో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఈపీఎస్-1995 పథకం కింద ఆసక్తిగా ఎదురుచూస్తున్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.7,500కి పెంచడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయ లక్షలాది మంది పెన్షనర్లకు దీపావళి బహుమతి ఇస్తారని చర్చ జరుగుతోంది.
ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్)లో నెలవారీ కనీస పెన్షన్ మొత్తం ప్రస్తుతం రూ.వెయ్యి ఉండగా.. ఇది 2014 నుంచి ఇప్పటివరకు సవరించలేదు. దీంతో ఈపీఎస్-95 పెన్షనర్లు తమ కనీస అవసరాలను తీర్చడం కష్టంగా మారింది. ఇది పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో రగులుతున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న పెన్షనర్ల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈపీఎస్-95 పెన్షన్ను రూ.7,500కి పెంచాలని పెన్షనర్లు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.































