తెలంగాణ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. అకౌంట్లలోకి రూ.25 కోట్లు

 కరోనా వైరస్ కారణంగా 2020లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌లో కోత విధించింది. ఆ పెన్షన్ కోతలపై రూ.25 కోట్ల వడ్డీని చెల్లించేందుకు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) కృతజ్ఞతలు తెలిపింది.


కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న 2020 మార్చి నుంచి మే వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో కోత విధించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం పెన్షనర్లకు ఏమాత్రం నచ్చలేదు. పైగా వారికి ఈ కోతలు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించాయి. ఈ మొత్తాలను తిరిగి చెల్లించాలనీ, అలాగే వడ్డీ కూడా ఇవ్వాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేశాయి.

2023లో తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. కోత విధించిన పెన్షన్ మొత్తాలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే 2023లోనే గత ప్రభుత్వం కోత విధించిన అసలు పెన్షన్ మొత్తాలను పూర్తిగా విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ మొత్తాలపై 6 శాతం వడ్డీగా లెక్కించి రూ.25 కోట్లను చెల్లించేందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బు అతి త్వరలో అకౌంట్లలో జమ కానుంది. అది వస్తే, అక్కడితో ఈ సమస్య తీరినట్లే. ఐతే.. ఇలా తమ మనీ తాము దక్కించుకునేందుకు పెన్షనర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. అందర్నీ ఆదుకుంటామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. పెన్షనర్లకు కోతలు పెట్టడంపై జేఏసీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

పెన్షనర్ల జేఏసీ ఛైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ.. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. “కరోనా కష్టకాలంలో పెన్షనర్లు ఎదుర్కొన్న ఇబ్బందులను లెక్కలోకి తీసుకొని, అసలు మొత్తాలతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు మేం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని వారు చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయం లక్షల మంది పెన్షనర్లకు ఊరట కలిగించింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ వడ్డీ కోసం చాలాకాలం నుంచి పోరాడుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ఫోకస్ పెట్టి.. ఇప్పుడు పరిష్కరించడం పట్ల పెన్షనర్లలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆర్థిక శాఖ ఉత్తర్వులతో ఈ మొత్తం త్వరలోనే పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు.

మొత్తంగా ఈ చర్యతో ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాపాడినట్లైంది. ప్రభుత్వం పట్ల పెన్షనర్లలో విశ్వాసాన్ని పెంచినట్లైంది. రాష్ట్రంలో పెన్షనర్ల సంక్షేమం పట్ల రేవంత్ సర్కార్ చూపుతున్న శ్రద్ధకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది. అదే సమయంలో గత ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య వైఖరి చూపిందనే విమర్శల్ని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.