అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2వేల మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం ఏర్పడింది.
ఈ మంచు తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫ్లైట్ అవేర్ డేటా ప్రకారం, ఈ వారాంతంలో ఇప్పటివరకు 8,000కు పైగా విమానాలను రద్దు చేశారు.
డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన సంస్థలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసి, టికెట్ మార్పు రుసుములను రద్దు చేశాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా టెక్సాస్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోవచ్చని హెచ్చరించింది.
మంచు ప్రభావం కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. గడ్డకట్టే వర్షం కారణంగా విద్యుత్ తీగలపై అంగుళం మందం వరకు మంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ తుపాను సోమవారం వరకు కొనసాగి, న్యూయార్క్, బోస్టన్ వంటి ప్రధాన నగరాలపై ప్రభావం చూపనుంది. తుపాను తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత కూడా అత్యంత శీతల గాలులు, ప్రమాదకరమైన వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
































