దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే ఈ పరేడ్ను ఎక్కడ చూడాలి? దిల్లీకి వెళితే టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? ముఖ్య అతిథులు ఎవరు? వంటి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
2026 జనవరి 26న దేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
రిపబ్లిక్ డే 2026 పరేడ్..
దేశవ్యాప్తంగా పౌరులు గర్వంగా, గౌరవంగా ఈ జాతీయ సెలవుదినాన్ని జరుపుకుంటున్న వేళ.. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న కర్తవ్య పథ్లో జరిగే ఐకానిక్ పరేడ్తో వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తారు.
ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు రిపబ్లిక్ డే పరేడ్ను చూడటానికి దేశ రాజధానికి చేరుకుంటారు. ఒకవేళ మీరు దిల్లీ వెళ్లలేకపోయినా, ఇంట్లోనే కూర్చుని గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
రిపబ్లిక్ డే 2026 పరేడ్- ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
రిపబ్లిక్ డే పరేడ్ ఆన్లైన్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఈ పరేడ్ సంబంధించిన సమయం, టికెట్లు, ఇతర వివరాలు ఇక్కడ ఉన్నాయి:
తేదీ – ఛానల్: 2026 జనవరి 26, సోమవారం నాడు దూరదర్శన్లో రిపబ్లిక్ డే పరేడ్ 2026 ప్రసారం అవుతుంది.
డిజిటల్ ప్లాట్ఫామ్స్: దూరదర్శన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానెల్, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దేశంలోని ప్రధాన వార్తా ఛానెళ్లన్నీ ఈ వేడుకలను లైవ్లో చూపిస్తాయి.
సమయాలు: దిల్లీలోని కర్తవ్య పథ్లో పరేడ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. లైవ్ బ్రాడ్కాస్ట్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతుంది. పరేడ్ గ్యాలరీల్లోకి ప్రవేశ ద్వారాలు ఉదయం 7 గంటలకే తెరుచుకుంటాయి.
టికెట్ల ధరలు: రిపబ్లిక్ డే పరేడ్ టికెట్ల ధరలు రూ. 20 నుంచి రూ. 100 వరకు ఉన్నాయి. అలాగే ‘బీటింగ్ ద రిట్రీట్’ ఫుల్ డ్రెస్ రిహార్సల్ టికెట్ ధర రూ. 20 కాగా, ప్రధాన వేడుక టికెట్ ధర రూ. 100 గా నిర్ణయించారు.
ప్రధాన థీమ్: ఈ ఏడాది పరేడ్ ‘150 ఇయర్స్ ఆఫ్ వందేమాతరం’ (150 ఏళ్ల వందేమాతరం) అనే ప్రధాన ఇతివృత్తంతో సాగనుంది.
టికెట్లు ఎక్కడ కొనాలి?
రాష్ట్రపర్వ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, టికెట్లు ‘ఆమంత్రన్’ (Aamantran) వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
ఆఫ్లైన్లో కొనాలనుకునే వారు సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లలోని బూత్లు లేదా కౌంటర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. టికెట్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
రిపబ్లిక్ డే పరేడ్ 21026- ముఖ్య అతిథులు..
ఈ ఏడాది జరిగే 77వ గణతంత్ర వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

































