వరల్డ్ కప్ సెమీస్​కు ఆఫ్ఘానిస్థాన్.. తాలిబన్ల నుంచి BCCIకి మెసేజ్!

నిన్న మొన్నటి వరకు ఆ జట్టును అంతా పసికూనగా చూశారు. ఈ టీమ్ ఏం చేయగలదని తక్కువ అంచనా వేశారు. అయితే అదే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ సైడ్​గా మారింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకుంటే..


ఏకంగా సెమీస్​కు అర్హత సాధించింది. మనం మాట్లాడుకుంటోంది ఆఫ్ఘానిస్థాన్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రషీద్ సేన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పట్టుదలతో ఆడుతూ పొట్టి కప్పు సెమీస్​కు దూసుకెళ్లింది. సూపర్-8లో తొలుత ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆ తర్వాత కీలకమైన మరో పోరులో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. దీంతో ఆ దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనల మధ్య సంతోషానికి ఆమడ దూరంలో ఉండే ఆఫ్ఘానిస్థాన్​లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. రషీద్ సేన సక్సెస్​ను ఆ దేశ ప్రజలు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ భయపడకుండా రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. వేలాది మంది ఒకేచోట గుమిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. ఇన్నేళ్లుగా తాము పడుతున్న బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్​లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం.

‘మేం ఎప్పటికీ భారత్​కు రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం’ అని తాలిబన్ గవర్నమెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీసీఐకి తాలిబన్ల నుంచి వచ్చిన మెసేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ల సక్సెస్​లో ఇండియా పాత్ర ఎంతో ఉందని అంటున్నారు. అడిగిన వెంటనే వాళ్లకు అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్​ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు బీసీసీఐ అంతా తానై అండగా నిలబడిందని మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్​కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.