టెన్త్‌ క్లాస్‌ పబ్లిక్ పరీక్షల విధానంలో మార్పులు.. ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం!

www.mannamweb.com


వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

ఇప్పటికే పదో తరగతి సిలబస్‌ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌లోని అన్ని పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌నే అమలు చేస్తున్నారు. విద్యార్థులు కూడా తమ పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ చదువుతూనే రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే సీబీఎస్‌ఈ విధానంలో ఇంటర్నల్‌ మార్కుల విధానం అమలులో ఉంది. దీనిని కూడా అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ సమాయాత్త మవుతుంది. అయితే గతంలో సీసీఈ విధానంలో ఇంటర్నల్‌ మార్కులు విధానం అమలులో ఉండగా.. 2019లో దీనిని రద్దు చేశారు.

ఇంటర్నల్‌ మార్కుల విషయంలో ప్రభుత్వ బడులు నిబంధనలు పాటిస్తున్నప్పటికీ.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటున్నాయని ఫిర్యాదులు రావడంతో గతంలో ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇక విద్యాశాఖ తాజా నిర్ణయంతో 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాత పరీక్షకు 80 మార్కులు, 20 ఇంటర్నల్‌ మార్కులు ఇవ్వనున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకువచ్చేలా కార్యచరన రూపొందిస్తున్నారు. సీబీఎస్‌ఈలో ఇంటర్నల్‌ మార్కుల 20కి 20 వేసుకోకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఇస్తున్నారు. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున ఇస్తున్నారు. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా విద్యాశాఖ మార్పు చేయనుంది.

డిసెంబర్‌ 1న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2025 పరీక్ష.. నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు

నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ప్రతీ ఏటా న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా క్లాట్‌ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటి దరఖాస్తు గడువు అక్టోబర్‌ 22వ తేదీతో ముగుస్తుంది. ఇదుంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటాయి. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ), పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ) ప్రవేశాలకు క్లాట్‌ పరీక్ష డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ముగింపు సమయంలోపూ జనరల్ అభ్యర్ధులు రూ.4,000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులు రూ.3,500 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.