పిల్లలకు పరగడపున పాలు తాగిస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసా..

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా, చక్కగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం పోషకమైన ఆహారాన్ని అందిస్తుంటారు. పోషకాహారం అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది పాలు. నిజమే, పాలు పిల్లలకు పుష్కలమైన కాల్షియం అందించి, వారిని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. అయితే, పాలు తాగించడానికి కూడా సరైన సమయం ఉంటుందని, దానిని పాటించడం ద్వారానే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అనేక మంది తల్లిదండ్రులు ఉదయం నిద్రలేవగానే, బ్రష్ చేసిన వెంటనే పిల్లలకు పాలు ఇస్తుంటారు. ఉదయాన్నే పాలు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుందని వారు భావిస్తారు. కానీ, ఈ అలవాటు పిల్లలలో కొన్ని సమస్యలను సృష్టించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు పిల్లల్లో చిరాకును కలిగించగలవు. అందుకే, కొందరు నిపుణులు పిల్లలకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు ఇవ్వకూడదని చెబుతున్నారు.


ఉదయం పూట పిల్లలకు పాలు ఎందుకు ఇవ్వకూడదు?

పాలలో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే, ఉదయాన్నే మొదటగా పాలు తాగితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పాలలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రెండూ లేకపోవడం వల్ల ఉదయం పూట పాలు తాగడం సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా రోజు మొత్తం చురుకుగా ఉండాలనుకుంటే ఉదయం పాలు తాగడం తగ్గించాలి. ఇది జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. శక్తి తగ్గిపోతుంది. కాబట్టి, పిల్లలకు ఏదైనా తినిపించిన తర్వాతే పాలు ఇవ్వడం ఉత్తమం. పిల్లలకు అల్పాహారం తర్వాతే పాలు తాగే అలవాటు చేయాలి.

ఆకలి లేకపోవడం: ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, దీనివల్ల పిల్లలకు ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఫలితంగా, వారికి ఆకలి వేయదు. పిల్లలకు ఆకలి వేయకపోతే, వారు ఇతర పోషకాలను తీసుకోలేరు. ఇది వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయం నిద్రలేవగానే పిల్లలకు తల్లిపాలు కూడా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి.

పొట్ట ఉబ్బరం: పాలలో ఫైబర్ ఉండదు. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ చురుకుగా ఉండదు. అందుకే గ్యాస్ సమస్యను తగ్గించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినమని వైద్యులు సలహా ఇస్తారు. పాలలో ఫైబర్ లేనందున, ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల రోజంతా అసౌకర్యం, కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అయితే, ఈ లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయని చెప్పలేం. జీర్ణ సమస్యలు ఉన్నవారిలో అధిక మోతాదులో పాలు తీసుకున్నప్పుడు లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

రాత్రిపూట పాలు వద్దు: రాత్రిపూట ఎక్కువ పాలు తాగడం వల్ల పిల్లలలో ఐరన్ లోపం ఏర్పడవచ్చు. ఇతర ఆహార పదార్థాల నుండి ఐరన్ గ్రహింపు సరిగ్గా జరగదు. అంతేకాకుండా, పాలలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లలలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఫైబర్ లోపం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి, ఏదైనా తిన్న తర్వాతే పాలు తాగే అలవాటు చేసుకోవడం అవసరం.

ఏం తినిపించాలి? పాలకు బదులుగా తేలికైన ఆహారం ఇవ్వడం ఉత్తమం. యాపిల్, అరటిపండు లేదా పొప్పడి వంటి పండ్లను ఇవ్వవచ్చు. ఇవి అందుబాటులో లేకపోతే, అల్పాహారంలో ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా వంటివి ఇవ్వవచ్చు. వీటిలో సరైన మోతాదులో పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి కాబట్టి పిల్లలు సంతోషంగా తింటారు. ఓట్స్ లేదా సజ్జ పిండిని కూడా ఇవ్వవచ్చు. అయినప్పటికీ, ఉదయం పాలు ఇవ్వాలనుకుంటే, ఏదైనా తినిపించిన తర్వాతే ఇవ్వాలి. ఉదయం కాకపోతే, సాయంత్రం స్నాక్స్ సమయంలో ఇవ్వవచ్చు. కానీ ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు ఇవ్వకూడదు.