2022లో బైజూస్ నష్టం రూ.8,370 కోట్లు

ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ చాలా నెలల తర్వాత 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ఫలితాలను ప్రకటించింది. 2022లో కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.5,014 కోట్లుగా నమోదవగా, నికర నష్టాలు అంతకుముందు ఏడాది రూ. 4,599 కోట్ల నుండి రూ. 8,370 కోట్లకు పెరిగాయి. బైజూస్‌కు కరోనా తరువాత నుంచి క్రమంగా నష్టాలు పెరుగుతున్నాయి. డిజిటల్ పాఠాలకు ఆదరణ కరోనా సమయంలో ఎక్కువగా ఉండటంతో నికర ఆదాయం పెరగ్గా, ప్రస్తుతం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి.


కంపెనీ మొత్తం ఆదాయం 2022లో దాదాపు రూ. 5,298.4 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇది రూ. 2,428.3 కోట్లుగా నమోదైంది. తమ నిర్వహణ, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే 2022లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లాభం 82 శాతం పెరిగి రూ.79.5 కోట్లకు చేరుకుంది.
బైజూస్ వివిధ కార్పొరేట్ సవాళ్లతో సతమతమవుతున్న తరుణంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్ బైజూస్ విలువను $1 బిలియన్‌కు తగ్గించడంతో కంపెనీ వాల్యుయేషన్ దెబ్బతింది. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఆదరణ క్షీణిచండంతో కంపెనీ నష్టాల నుంచి బయటపడటానికి వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. జూన్ 2024లో కంపెనీ IPOకు రావాలని చూస్తుందని గతంలో అధికారులు తెలిపారు.