Byjus News: దారుణంగా బైజూస్ రవీంద్రన్ పరిస్థితి.. 40 శాతం వాటా దక్కించుకున్న రంజన్..

Ranjan Pai: ఒకప్పుడు ప్రపంచం మెచ్చుకున్న భారతీయ స్టార్టప్ బైజూస్ ప్రస్తుతం ఇడియట్‌గా కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు చట్టపరమైన చర్యలు కంపెనీ విలువను అమాంతం పాతాళానికి తీసుకొచ్చాయి.
కరోనా కాలంలో స్కూళ్లు మూతపడటం పెద్ద వ్యాపార అవకాశాన్ని కల్పించటంతో కంపెనీ విపరీతంగా కొత్త కొనుగోళ్లకు దిగింది. విదేశాలకు సైతం విస్తరించిన వేళ కంపెనీ లాభదాయకతను అందుకోవటంలో మాత్రం వెనకపడింది. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులను సైతం తొలగించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు వ్యవస్థాపకుడు ఏకంగా తన సొంత ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి కంపెనీ దిగజారిపోయింది.


 

కంపెనీ వ్యాపారాన్ని నడిపించేందుకు అవసరమైన ఫండ్స్ లభించకపోవటంతో బైజూస్ అల్లాడిపోతోంది. ఈవారం కంపెనీ తన 2022 ఆర్థిక ఫలితాలను అత్యంత జాప్యం తర్వాత ప్రకటించింది. వేగంగా విస్తరించాలని, మార్కెట్ విలువను పెంచుకోవాలని చేసిన అడ్వర్టైజింగ్, ప్రమోషన్ ఖర్చులు కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలను వేగంగా కరిగించేశాయి. ఇలాంటి క్రమంలోనే మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ భాయ్ రంగంలోకి దిగారు. వివాదంలో ఉన్న యూఎస్ ఆధారిత డేవిడ్‌సన్ కెంప్‌నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఆకాష్ ఎడ్యుకేషన్‌లో కలిగి ఉన్న నాన్-పెర్ఫార్మింగ్ బాండ్‌లను కొనుగోలు చేయడానికి బైజూస్ 2023లో దాదాపు రూ.1,400 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.

ఈ పెట్టుబడి ద్వారా ఆకాష్ షేర్లలో రంజన్ భాయ్ 40 శాతం వాటాను పొందారు. ప్రస్తుతం బైజూస్ క్యాష్ కౌ అయిన్ ఆకాష్ కంపెనీలో కీలక వాటాదారుగా మారటం మణిపాల్ సంస్థకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2021లో ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌ని బైజూస్‌కు చెందిన బైజు రవీంద్రన్ 950 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు రంజన్ భాయ్‌తో 750 మిలియన్ డాలర్ల విలువ అంచనా విలువతో షేర్ల మార్పిడి జరిపారు.

ప్రస్తుతం రంజన్ భాయ్ ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లో 40 శాతం వాటాతో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉన్నారు. బైజు రవీంద్రన్ వ్యక్తిగతంగా 16 శాతం, బైజు పేరెంట్ థింక్ & లెర్న్ 26 శాతం కలిగి ఉన్నారు. చివరగా చౌదరీస్ అండ్ బ్లాక్‌స్టోన్ 18 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీంతో బైజూ రవీంద్రన్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టడంతోపాటు బైజస్ షేర్లు ఇప్పటికే భారీగా తనఖా పెట్టి ఇతర ఇన్వెస్టర్ల వద్ద ఉన్నందున బైజు రవీంద్రన్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.