బాల్యంలోనే అనేకమంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఇందుకు సగానికి పైగా కారణం చక్కెర, ఆయిల్ అనడంలో సందేహం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది.
అనుబంధ పాఠశాలలు అన్నింటికీ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు స్కూళ్లు ఇప్పుడు ఆయిల్, చక్కెర బోర్డుల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి విద్యార్థులు అధికంగా షుగర్, ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడనున్నాయి.
సీబీఎస్ఈ తాజా ఆదేశాల్లో పేర్కొన్న దానిప్రకారం.. 2019-21 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5), పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా అధిక బరువు లేదా ఊబకాయం ఉందని వెల్లడించింది. 2025లో ప్రచురించబడిన ఊబకాయం అంచనా అధ్యయనం అయిన లాన్సెట్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అధ్యయనం 2021 ప్రకారం.. భారతదేశంలో అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2021లో 18 కోట్ల నుండి 2050 నాటికి 44.9 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. దీని వలన భారతదేశం రెండవ అత్యధిక ప్రపంచ భారం కలిగిన దేశంగా మారుతుంది.
సీబీఎస్ఈ కొత్త ఆదేశాలు ఇవే..
ఆహారంలో ఉపయోగించే నూనె పరిమాణం గురించి పిల్లలలో అవగాహన పెంచడానికి పాఠశాలలు ఇప్పుడు ‘ఆయిల్ బోర్డులను’ ఏర్పాటు చేస్తాయి.
ఇప్పుడు అన్ని అధికారిక పత్రాలు ఊబకాయ నివారణకు సంబంధించిన సందేశాలను కలిగి ఉంటాయి.
జంక్ ఫుడ్ కంటే పోషకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తుంది.
విద్యార్థులు లిఫ్ట్లకు బదులుగా నడిచి మెట్లను ఉపయోగించమని ప్రోత్సహించబడతారు.
పాఠశాలలు వారి సౌలభ్యం, సృజనాత్మకతకు అనుగుణంగా ‘ఆయిల్ బోర్డులను’ రూపొందించవచ్చు.
































