Nepal: నేపాల్‌లో భారీ ప్రమాదం.. కొండచరియలు విరిగి నదిలోకి పడిన రెండు బస్సులు.. నీట మునిగిన 60 మంది ప్రయాణీకులు

www.mannamweb.com


నేపాల్ లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఈ రోజు ఉదయం నేపాల్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.

రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చిత్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు.

 

సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ హైవేపై ఈ ఉదయం 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ బస్సులు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి డీలక్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు వాహనంలో నుంచి దూకినట్లు చెప్పారు. ఈ రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని ట్వీట్‌ చేస్తూ నారాయణగర్‌-ముగ్లిన్‌ రోడ్డు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు.. బస్సు ప్రమాదంలో ప్రయాణీకులు మిస్సింగ్ తనకు బాధను కలిగించాయని వెల్లడించారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హోం అడ్మినిస్ట్రేషన్‌తో సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు తక్షణమే రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

బస్సుపై రాయి పడడంతో ఒకరు మృతి

అదే రహదారిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కిలోమీటరు 17 వద్ద మరొక ప్రయాణీకుల బస్సుపై రాయి పడటంతో ఒక వ్యక్తి మరణించాడు. బుట్వాల్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న బస్సు డ్రైవర్ మేఘనాథ్ బీకే కొండచరియలు విరిగిపడి రాయి బస్సు పైకి దూసుకుని వచ్చింది. అప్పుడు రాయి తగిలి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. చిత్వాన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భేష్‌రాజ్ రిజాల్ తెలిపారు.

కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం

నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ భవేష్ రిమల్ తెలిపారు. వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల నారాయణఘాట్-ముగ్లింగ్ రోడ్డు సెక్షన్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్ డివిజన్ భరత్‌పూర్ ప్రకారం, రహదారిపై ట్రాఫిక్ పునరుద్ధరించడానికి సుమారు నాలుగు గంటలు పడుతుందని వెల్లడించారు.