JEE Main: 23 మందికి 100% స్కోర్‌.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు వీళ్లే..

JEE Main 2024 Results | దిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌టీఏ(NTA) విడుదల చేసిన పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100శాతం స్కోరు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే. తెలంగాణకు చెందిన రిషి శేఖర్‌ శుక్లా, పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌, తవ్వ దినేశ్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి వెంకట తనీశ్‌ రెడ్డి 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు.


ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరైన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు.

2024 జెఈఈ మెయిన్స్‌ ఫలితాలలో 99.4 శాతం మార్కులతో నరసాపురానికి చెందిన కుర్రాడు కావలి.యశ్వంత్‌ టాపర్‌గా నిలిచాడు.


నరసాపురం 23 వ వార్డు కౌన్సిలర్‌ కావలి రామసీత నాని దంపతుల రెండవ కుమారుడు యస్వంత్‌ జెఈఈ మెయిన్స్‌ లో 99.4 శాతం మార్కులు సాధించి టాపర్‌ గా నిలవడం పట్ల యస్వంత్‌ కు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అభినందనలు తెలిపారు.