రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. రాబోయే నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ వేవ్ కొనసాగుతుండగా, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందని తెలిపారు.
రాజధాని హైదరాబాద్లోనూ చలి తీవ్రత గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతుండగా, మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
































