ఏఐ వాడే రాష్ట్రంలో ఆన్‌లైన్‌ కంప్లైంట్స్‌ తీసుకోరు…! ప్రజా ఫిర్యాదుల్లో అంతులేని జాప్యం

www.mannamweb.com


పాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల్ని స్వీకరించే విషయంలో మాత్రం ఆన్‌లైన్‌ వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురాకపోడంతో ఎక్కడెక్కడి నుంచో విజయవాడకు వస్తున్నారు.

సమస్య ఏదైనా తాము పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు.

పౌర ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రే స్వయంగా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో, ఉండవల్లి నివాసం వద్ద పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సైతం వాడుతున్నామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐఏఎస్‌లు ముఖ్యమంత్రిని మభ్య పెట్టారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కనీసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు.

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం నివాసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే బాధ్యతను మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఈ క్రమంలో వాట్సప్‌లో వచ్చిన అభ్యర్థనలకు కూడా లోకేష్ మొదట్లో స్పందించారు. ఓ దశలో ఆ‍యన ఫోన్‌ స్తంభించేలా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాట్సప్‌ ఫిర్యాదులు పంపొద్దని ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి వచ్చింది.

మొదట్లో మంగళగిరి నియోజక వర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం లోకేష్ నిర్వహించిన కార్యక్రమానికి క్రమేణా ఆదరణ పెరిగి రాష్ట్రం నలుమూలల నుంచి జనం తమ బాధలు చెప్పుకోడానికి ఉండవల్లి రావడం మొదలైంది. సమస్య ఏదైనా లోకేష్‌కు చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని ప్రచారం జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఉండవల్లి రావడం మొదలైంది.

మరోవైపు రాష్ట్రంలో గత ఐదేళ్లలో రాజకీయ కారణాలతో వేధింపులకు గురైన ప్రజలకు బాసటగా నిలవడానికి ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తాను స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తారనని చెప్పాడంతో చంద్రబాబుకు మొర పెట్టుకోడానికి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో నిత్యం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేశారు.

ఇదే పద్ధతిని జనసేన, బీజేపీలు కూడా అమలు చేస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
మీకోసం… నేరుగా వస్తేనే!

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వారంలో ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రారంభించారు. జన్మభూమి కార్యక్రమాలతో పాటు పాలనలో సంస్కరణల్లో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులు నిర్ణీత సమయంలో ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా సిటిజన్ చార్టర్లను అమలు చేశారు.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్కరణల్ని మరింత పక్కాగా అమలు చేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించే యంత్రాంగాలు ఏర్పాటు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1902 టోల్ ఫ్రీ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు చేశారు. వీటి పని తీరు అంతంత మాత్రంగానే ఉండేది. కాల్ సెంటర్ల నిర్వహణ, ప్రభుత్వ విభాగాల స్పందన నాసిరకంగాఉండేది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 1902 కాల్ సెంటర్‌ రద్దు చేశారు.

కొత్త ఏజెన్సీతో సేవలు ప్రారంభించాలని నిర్ణయించినా అదింకా కార్యరూపం దాల్చలేదు. సెంట్రలైజ్డ్‌ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినా అది పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రకరకాల సమస్యలతో ప్రజలు ఉండవల్లి వరకు రావాల్సి వస్తోంది.
ఐదేళ్లుగా నిర్వీర్యమైన ఫిర్యాదుల వ్యవస్థలు…

ఏపీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలన్నీ ఐదేళ్లుగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వ్యవస్థలన్నీ గాడి తప్పాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు గతంలో ఉన్న వ్యవస్థల్ని మార్చేసి కొత్త ప్రయోగాలు చేయడంతో పాత వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, విద్యుత్, సివిల్ సప్లైస్, రెవిన్యూ వంటి విభాగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో చాలా ఏళ్ల క్రితమే 103, ఆన్‌లైన్‌ కంప్లైంట్‌ రిజిస్ట్రేషపన్‌ వ్యవస్థలు సమర్థవంతంగా నడిచేవి. వీధి లైట్లు మొదలుకుని, డ్రెయినేజీ వ్యవస్థ, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపై ఫిర్యాదు చేసిన 24గంటల్లో పరిష్కరించేలా సమర్ధవంతమైన వ్యవస్థ ఉండేది.

రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కేంద్రీకృతం చేసి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ వెబ్‌సైట్‌కు అనుసంధానించారు. దాన్నైనా సమర్ధవంతంగా నిర్వహించారా అంటే అదీ లేదు. వెబ్‌సైట్‌లలో గ్రీవెన్స్ ఆప్షన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో జనానికి ఫిర్యాదు చేసే అవకాశమే లేకుండా చేశారు.

ప్రతి 2వేల కుటుంబాలకు ఓ ప్రభుత్వ కార్యాలయం పేరుతో వైసీపీ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజలకు నేరుగా అందిన ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ అంతు చిక్కదు. పారిశుధ్యం, తాగునీరు, డ్రెయినేజీ, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారంలో వీటి పాత్ర నామమాత్రంగా ఉంటోంది. ప్రజల ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో గతంలో సిటిజన్ ఛార్టర్, నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదులు, దరఖాస్తులు పరిష్కరించాలానే విధానాలు అమలయ్యేవి.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో ఆన్‌లైన్ ఫిర్యాదుల వ్యవస్థలు అందుబాటులోకి రాకపోవడానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వ వర్గాల నుంచి సరైన స్పందన రాలేదు. నామమాత్రంగా మారిన మీ కోసం పోర్టల్‌‌లో పూర్తి స్థాయి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై సంబంధిత వర్గాలు సమాచారం ఇవ్వలేకపోయాయి.