పింఛను 4 వేలు -ఉద్యోగులకు పిఆర్సి, పంచాయతీలకు నిధులు

యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి : కుప్పంలో చంద్రబాబుతిరుపతి : తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఒకటిన నాలుగు వేల రూపాయలు పింఛను ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
లాయర్లకు, జర్నలిస్టులకు, మహిళలకు, టీచర్లకు, ఉద్యోగులకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలిస్తామని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా కుప్పం వచ్చారు. ఈ సందర్భంగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని, యుద్ధానికి అందరూ సిద్ధం కావాలని టిడిపి శ్రేణులను కోరారు. 40 రోజులు అలుపెరగకుండా కష్టపడితే విజయం మనదేనన్నారు. ‘కుప్పంలో లక్ష మెజార్టీకి సిద్ధమా?’ అంటూ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఉత్సాహపర్చారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు కేటాయించి పూర్వ వైభవం, ప్రజాపాలన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డిఎతో పొత్తు తప్పనిసరని సమర్థించుకున్నారు. బిజెపితో పొత్తును ముస్లిం, మైనార్టీ సోదరులు వేరుగా భావించవద్దని, వారి ప్రయోజనాలను కాపాడతానని చెప్పుకొచ్చారు.
పేదవారికి అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే, జగన్ వచ్చాక వాటిని ధ్వంసం చేశారన్నారు. జగన్ పది రూపాయలిచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. వైసిపి నాయకులు భూ కబ్జాలకు పాల్పడడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని, అందుకు కడప జిల్లా ఒంటిమిట్ట పద్మశాలీ కుటుంబమే తాజా ఉదాహరణని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్, గంజాయి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. మత్తుకు బానిసై యువత చెడ్డదారి పడుతోంది. జాతి నిర్వీర్యం అవుతోంది.’ అని అన్నారు. వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు.