అందాల హరివిల్లు బల్లాల రాయనదుర్గ కోట

బనశంకరి: బల్లాల రాయనదుర్గ అనేది చిక్‌మగళూరు పశ్చిమ కనుమల మధ్య పర్వతం మీద ఉన్న కోట. సముద్ర మట్టానికి 1509 మీటర్ల ఎత్తులో ఉన్న వాన్టేజ్‌ పాయింట్‌.
లోయలు, ప్రవాహాలు, రోలింగ్‌ పొగమంచు పర్వతాలతో నయమనోహరంగా ఉంటుంది. అన్నింటి కంటే మించి ఇక్కడ తేమతో కూడిన మేఘాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి.

ట్రెక్కింగ్‌ స్వర్గధామం కనువిందు చేసే పర్వతాలు చిక్‌మగళూరుకు చారిత్రక నేపథ్యం కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం


బల్లాల రాయన దుర్గ చేరుకోవడానికి దట్టమైన అడవులు పచ్చిక భూములు మధ్య ట్రెక్కింగ్‌ చేయాలి. రాయన దుర్గ ప్రాంతంలో అడుగుపెట్టగానే కొండల అంచున కిలోమీటర్లు దూరంలో నిర్మించిన కోటగోడను చూడవచ్చు. కోట బయటి గోడపై నిలబడి సూర్యుడి రంగుల కాంతులు వీక్షిస్తూ సందడి చేయవచ్చు. బల్లాల రాయనకొండలు హొయసల రాజవంశానికి చెందిన వీర బల్లాల మొదటి భార్య నిర్మించిన కోట నిలయం. 12వ శతాబ్దంలో కర్ణాటక ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రఖ్యాతి పొందింది. కానీ నేడు కోట శిథిలాలు అంటే పగిలిన గోడలు, తోరణాలు, నేలమాళిగ మాత్రమే ఉంది. దుర్గాదహళ్లిలోని కోట పాదాల వద్ద ఉన్న కాల బైరవేశ్వర దేవాలయం వద్ద నుంచి ట్రెక్కింగ్‌ ప్రారంభమౌతుంది. ఇది బల్లాల రాయనదుర్గ శిఖరానికి నాలుగు కిలోమీటర్లు మేర ఉండటంతో రెండు గంటలు సమయం పడుతుంది. ట్రెక్‌లో కొన్ని నిమిషాల తరువాత ఒకటవ పాయింట్‌కు చేరుకుని దిగువన గల గ్రామం పట్టణాన్ని వీక్షించవచ్చు. అధికంగా పచ్చని గడ్డితో కూడిన పచ్చిక బయళ్లలో అటవీమార్గంలో ట్రెక్కింగ్‌ చేయాలి. రెండు పర్వతాలను దాటి బల్లాల రాయనదుర్గ చేరుకుంటారు. రాయన దుర్గ ట్రెక్‌ వర్షాకాలం చివరి వరకు వెళ్లవచ్చు. లోయ మొత్తం పచ్చదనంతో కూడుకుని ఉంటుంది. గడ్డిభూములు, హిమాలయాల నుంచి నేరుగా ఉన్నట్లు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి హొరనాడు లేదా మూడగెరెకు బస్సులో వెళ్లవచ్చు. అక్కడ నుంచి స్థానిక బస్సులు, లేదా జీపుల్లో 30 కిలోమీటర్ల దూరంలోని సుంకసాలేకి చేరుకుని బల్లాల రాయనదుర్గ ట్రెక్‌ ప్రారంభ ప్రాంతం నుంచి దుర్గాదహళ్లికి ఆటో, రిక్షాలో చేరుకోవాలి