వన్యప్రాణుల అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన పూణే అటవీశాఖ అధికారులు.. అక్రమంగా నెమలీకలు విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో శుక్రవారం సోమవార్ పేట్ ప్రాంతంలోని నర్పత్గిరి చౌక్ సమీపంలోని ఓ గోడౌన్పై దాడి చేశారు.
అక్కడ భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన నెమలీకలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనితో పాటు అక్కడున్న ఉత్తరప్రదేశ్కు చెందిన 11 మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడిన వ్యక్తిని విచారించగా.. ఆ గోడౌన్కు సమీపంలోని ఓ ప్రదేశంలో నెమలీకల నిల్వలు ఉన్నట్టు తెలిపాడు. దీనితో నిందితుడు చెప్పిన సంత్ గాడ్గేబాబా ధర్మశాల ప్రాంగణానికి అటవీశాఖ అధికారులు వెళ్లారు వెళ్లారు. అక్కడ సుమారు 400 నుండి 500 కిలోల నెమలి ఈకలను కట్టి దాచిపెట్టినట్టు గుర్తించారు. ఇక వాటిని స్వాధీనం చేసుకొని ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసుపై స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హృషికేష్ చవాన్ మాట్లాడుతూ.. తమకు అందిన విశ్వసనీమ సమాచారాం మేరకు సోమవార్ పేట్ ప్రాంతంలోని నర్పత్గిరి చౌక్ సమీపంలోని ఓ గోడౌన్పై దాడి చేశామని.. అక్కడ భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన నెమలి ఈకలను కనుగొన్నామని తెలిపారు. నిందితుల వద్ద చెల్లుబాటు అయ్యే ఎటువంటి లైసెన్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ లేవని.. ఇది కచ్చితంగా అక్రమంగా జరుగుతున్న వ్యాపారమేనని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ కేసులో పట్టుబడిన 11 మందిపై 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ చట్టం నెమలి ఈకలను కలిగి ఉండటం, విక్రయించడం, రవాణా చేయడం వంటి వాటిని కచ్చితంగా నిషేధిస్తుంది. నెమలి ఈకల సేకరణ వల్ల నెమళ్లకు హాని జరగకపోయినప్పటికీ, వాణిజ్యపరమైన దోపిడీ, తరచూ వేట, అక్రమ వ్యాపారానికి దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు.
































