కష్టపడితే ఏదైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. అహర్నిశలు లక్ష్యంపై ఫోకస్ చేస్తే దేన్ని అయినా అవలీలగా సాధించవచ్చు. దీనికి జీవితంలో ఎన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
తాజాగా ప్రయాగ్ రాజ్ కు చెందిన శైలేంద్ర సింగ్ గౌర్ 18 ఏళ్లు కష్టపడి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఆయ నిరంతర కృషి ఫలితంగా ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సిక్స్ స్ట్రోక్ ఇంజన్ను రూపొందించారు. ఈ ఇంజన్.. నాలుగు స్ట్రోక్ ఇంజన్లకు భిన్నంగా ఆరు దశలలో పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ ఇంజన్ను రూపొందించడం ద్వారా 100 సీసీ ఇంజన్తో లీటర్కు 176 నుంచి 200 కిలోమీటర్ల వరకు మైలేజీని సాధించవచ్చని శైలేంద్ర సింగ్ గౌర్ చెబుతున్నారు. ఇది సాధారణ ఇంజన్లతో పోలిస్తే మూడింతలు మైలేజ్ ఇస్తోందని ఆయన చెప్పారు.
పర్యావరణ కాలుష్యం తగ్గే అవకాశం..
మామూలుగా ఇంటర్నల్ కంబస్టియన్ (ఐసీ) ఇంజన్లలో నాలుగు దశలు ఉంటాయి. ఇంటేక్, కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్ దశలు ఉంటాయి. అయితే, శైలేంద్ర రూపొందించిన సిక్స్ స్ట్రోక్ ఇంజన్లో అదనంగా రెండు దశలు ఉంటాయి. ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ సాయంతో మైలేజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు అదనపు స్ట్రోక్లు వేడిని రీసైకిల్ చేసి, అదనపు శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతాయి. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని శైలేంద్ర చెబుతున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు.
టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ వరకు..
ఈ ఆవిష్కరణకు భారత ప్రభుత్వం నుండి రెండు పేటెంట్లు లభించాయి. శైలేంద్ర ఈ ఇంజన్ను అభివృద్ధి చేయడానికి తను చదువుకున్న సైన్స్ గ్రాడ్యుయేట్, అలాగే సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ ఇంజన్ ను టూ వీలర్స్ నుండి ఫోర్ వీలర్స్ వరకు వివిధ రకాల వాహనాలలో ఉపయోగించవచ్చు, ఇది ఆటోమొబైల్ పరిశ్రమలో విస్తృత అనువర్తనాలను కలిగి ఉంది.
శైలేంద్ర సింగ్ గౌర్ గ్రేట్..
ఈ సాంకేతికత ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా పర్యావరణ సంరక్షణకు ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ దోహదపడుతుంది. శైలేంద్ర సింగ్ గౌర్ ఈ ఆవిష్కరణ ద్వారా భారతదేశంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి ఒక మైలురాయిని స్థాపించారు. ఈ ఇంజన్ భవిష్యత్తులో ఆటోమొబైల్ పరిశ్రమను పరివర్తన చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది భారత ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.
































