భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హౌరా-గువహటి మధ్య నడిచే ఈ హైటెక్ రైలులోని ఫస్ట్ క్లాస్ ప్రైవేట్ కూపే విశేషాలు, టికెట్ ధరల, అత్యాధునిక వసతులపై ఒక ప్రత్యేక కథనం.
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్న ‘వందే భారత్ స్లీపర్’ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హౌరా-గువహటి (కామాఖ్య) మధ్య నడవనున్న ఈ రైలుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రైలులోని ‘ఫస్ట్ క్లాస్ ప్రైవేట్ కూపే’ విమాన ప్రయాణాన్ని తలపించేలా ఉండటం ప్రయాణికులను అబ్బురపరుస్తోంది.
జంటల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ కూపే
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ దేవరాజ్ దివాన్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ విలాసవంతమైన రైలు లోపలి విశేషాలను పంచుకున్నారు. ప్రధానంగా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లోని ‘టూ-పర్సన్ కూపే’ గురించి ఆయన వివరించారు.
“మీరు జంటగా ప్రయాణించాలనుకుంటే, ఇది అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక. పాతకాలపు ఓపెన్ క్యాబిన్లలా కాకుండా, ఇది పూర్తిగా మూసివేసి ఉండే ప్రైవేట్ గదిలా ఉంటుంది. ఇది ప్రయాణికులకు పూర్తి భద్రతతో పాటు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది” అని దేవరాజ్ తన వీడియోలో పేర్కొన్నారు.
రైలు లోపలి ఇంటీరియర్ డిజైన్ చాలా హుందాగా, చూడముచ్చటగా ఉందని, ఇద్దరు కూర్చోవడానికి విశాలమైన సీట్లు, వాటర్ బాటిల్ హోల్డర్లు వంటి చిన్న చిన్న సౌకర్యాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆయన వివరించారు.
హైటెక్ వసతులు ఇవే..
కేవలం గోప్యత మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా ఈ స్లీపర్ రైలు ఎంతో ముందుంది. ఈ కూపేలో ఉన్న ఇతర ప్రత్యేకతలు ఇక్కడ చూడవచ్చు.
ఛార్జింగ్ పాయింట్లు: ప్రయాణికుల వద్ద ఉండే వివిధ రకాల గ్యాడ్జెట్ల కోసం మూడు వేర్వేరు ఛార్జింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
పర్సనల్ ఏసీ కంట్రోల్: ప్రయాణికులు తమకు నచ్చినట్లుగా ఏసీ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకునేలా ఆధునిక ఏసీ వెంట్లను అమర్చారు.


































