Undavalli Caves story- ఉండవల్లి గుహలు-ఉలితో చెక్కిన సౌందర్యాలు.. ఉండవల్లి గుహాలయాలు..!

ఉండవల్లి గుహలు—ఉలితో చెక్కిన సౌందర్యాలు.. ఉండవల్లి గుహాలయాలు..!


ఉండవల్లి గుహలు
ఉండవల్లి గుహలు (ముందు వైపు)

ఉండవల్లి’ అంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏక శిలా ‘అనంత పద్మనాభ స్వామి’ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.

గుహ బయటివైపు
గుహ బయటివైపు

బౌద్ధులకు నిలయం..
ఈ గుహలు.. మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

 

ఉండవల్లి గుహలు లోపలిభాగం
ఉండవల్లి గుహలు లోపలిభాగం

ఏయే అంతస్తుల్లో ఏమున్నాయి..?
ఈ నాలుగు అంతస్తుల గుహల్లో.. మొదటి అంతస్తులో రుషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. రెండో అంతస్తులో శయనించి ఉన్న ‘అనంత పద్మనాభస్వామి’ విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందలో ఎలాంటి విగ్రహాలు లేవు.
గుహల నుంచి రహస్య మార్గాలు..
గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి ఉంది.

అనంత పద్మనాభ స్వామి ప్రతిమ
అనంత పద్మనాభ స్వామి ప్రతిమ

ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు.

ఎలా చేరుకోవాలి..?
ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి.. అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్లి కూడలికి చేరుకుని.. ఎడమ పక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి. విజయవాడ నుంచి వచ్చేవారు.. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకుని కుడి వైపునకు మూడు కిలో మీటర్లులోనికి వెళితే ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చు.

తెలుగులో శాశనం
తెలుగులో శాశనం

సందర్శన వేళలు..
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.

Video …