ఏపీలో ఇంటి నుంచే పని చేసేందుకు వీలుగా ఆసక్తి ఉన్న అభ్యర్ధుల నుంచి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కౌశలం సర్వే నిర్వహించింది. ఇందులో 10వ తరగతి నుంచి ఆ పైన అర్హతలు ఉన్న వారి నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది.
దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఓసారి గడువు ముగిసినా దాన్ని పొడిగించి మరీ ఇలా వర్క్ ఫ్రమ్ కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఆ తర్వాత దీనిపై అప్డేట్ లేకపోవడంతో వారంతా ఎదురుచూస్తున్నారు.
వీరికి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. కౌశలం సర్వేలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కౌశలం సర్వేలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు త్వరలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం సచివాలయాలకు హెడ్ఫోన్లు (మైక్తో), వెబ్ కెమెరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరికరాల పంపిణీ పూర్తయిన తర్వాత ఇతర ఏర్పాట్లు చేసుకుని పరీక్షల తేదీల్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వం ఆయా సంస్థల సహకారంతో కల్పించే ఉద్యోగాలను వీరు చేయగలరో లేదో నిర్ధారించేందుకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు.
మరోవైపు రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్.. ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం ను కూడా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే కౌశలం సర్వే పేరుతో వర్క్ ఫ్రమ్ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి దగ్గరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ దరఖాస్తుల్ని రెండు నెలల క్రితమే స్వీకరించడం పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియపై ఫోకస్ పెడుతోంది.


































