ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేసేది ఎవరు? విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు తెలియకుండానే ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆదేశాలు

తానే ప్రభుత్వంలా వ్యవహరిస్తున్న సురేష్‌ కుమార్‌
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు తెలియకుండానే ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆదేశాలు
ఒక్కో పోస్టుకు రూ.40 లక్షల వసూలు


ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టులను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పోస్టుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని.. తనకే సర్వాధికారాలు ఉన్నట్లుగా భావిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం మారినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కూడా మారిపోతాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా మెమోలు జారీచేసేస్తున్నారు. ఒకరకంగా తానే ప్రభుత్వం అన్నట్లుగా సురేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఒక్కో ఎయిడెడ్‌ పోస్టు రూ.40 లక్షలకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో 109 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 307 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే మంత్రి లోకేశ్‌కు సమాచారం ఇవ్వాలి. కానీ, ఆయనకు చెప్పకుండానే నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ మెమో జారీచేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసినందున నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయ పోస్టులంటే ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగాలే. వీటికి జీతాలు ప్రభుత్వ గ్రాంటు నుంచే చెల్లిస్తారు. ఇలాంటి ఉద్యోగాలను విద్యాశాఖ మంత్రికి తెలియకుండా రహస్యంగా భర్తీచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్షల్లో వసూలు.. అందరికీ వాటాలు

ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయ పోస్టును రూ.40 లక్షలకు అమ్మేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కొందరు కరస్పాండెంట్లు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు పొందుతున్నారు. రాష్ట్రంలో 846 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 109 పాఠశాలలు టీచర్‌ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టుల భర్తీకి అనుమతించారు. వీటిలో 307 పోస్టులు ఉండగా.. ఇప్పటికే 266 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇంకా 41 పోస్టులు భర్తీచేయాలి. ఈ పోస్టుల భర్తీకి టెట్, డీఎస్సీ లాంటి పోటీపరీక్షలు లేకుండా తూతూమంత్రంగా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ముందుగానే లీక్‌ చేసి, కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చేలా అమ్మేస్తున్నారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ పోస్టులు కమీషన్లు తెచ్చిపెడుతుండడంతో ఈ నియామక విధానం మార్పునకు ఎవ్వరూ గట్టి చర్యలు తీసుకోవట్లేదు. అవినీతిని అరికట్టాలంటే ఎంపిక విధానాన్ని మార్చాలని, అవసరమైతే ఎయిడెడ్‌ చట్టానికి సవరణ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ఎంపిక విధానం ఇలా..

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఐదుగురు సభ్యుల కమిటీ ఉంటుంది. ఆయా పాఠశాలల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయుడు, విద్యాశాఖ తరఫున డిప్యూటీ డీఈఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి, ఇద్దరు సబ్జెక్టు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఈ సబ్జెక్టు నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్‌ పాఠశాల కరస్పాండెంట్‌కు ఉంటుంది. టెట్‌ అర్హత ఉన్నా.. మెరిట్‌కు ప్రాధాన్యం లేదు. అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నపత్రం రూపకల్పనే అక్రమాలకు నిలయంగా మారుతోంది. రాతపరీక్షకు 95 మార్కులు, ఇంటర్వ్యూకు 5 మార్కులు ఇస్తున్నారు.

ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జీటీ టీచర్ల దస్త్రానికి డీఈఓ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులైతే ఆర్జేడీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయితే ఎంపికైనవారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. పైగా ఇక్కడ అప్రెంటిస్‌ విధానం కూడా లేదు. నేరుగా స్కేల్‌ ఇచ్చేస్తారు.

పకడ్బందీ వ్యవస్థ ఉండాలి

ఎయిడెడ్‌లో టీచర్‌ పోస్టులు భర్తీచేయాలని యాజమాన్యాలు ఒక్కొక్కటిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. భవిష్యత్తులో మిగిలిన 737 పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలి.

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. డీఎస్సీ తరహాలో పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొంది. పోస్టుల భర్తీకి మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ పద్ధతి పాటించాలని, ఏటా సెప్టెంబరు 30 నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా అక్టోబరులో హేతుబద్ధీకరణ నిర్వహించాలని సూచించింది. ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీఓను కోర్టు రద్దుచేసింది.
ప్రభుత్వం ఇచ్చే గ్రాంటుతో జీతాలిచ్చే పోస్టులు కావడంతో ఎయిడెడ్‌లోని టీచర్, బోధనేతర పోస్టులకు ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నియామకాల్లో అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేయాలి