Wife Kills Husband In Front Kids | ప్రియుడితో కలిసి.. పిల్లల ముందే భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. పిల్లల ముందే అతడి గొంతు కోసి చంపింది. (Wife Kills Husband In Front Kids) ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పడేసింది.


భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మాల్వానీ ప్రాంతంలో నివసించే 30 ఏళ్ల రాజేష్ చౌహాన్‌ రోజువారీ కూలీ. అతడి స్నేహితుడైన ఇమ్రాన్ మన్సూరి, భార్య పూజ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న రాజేష్‌ను అంతం చేయాలని వారిద్దరూ ప్లాన్‌ వేశారు. ఫిబ్రవరి 3న రాత్రి వేళ నిద్రిస్తున్న రాజేష్‌ను ప్రియుడు ఇమ్రాన్‌ సహాయంతో పూజ హత్య చేసింది. తన ఇద్దరు పిల్లల ముందే భర్త గొంతు కోసి చంపింది.

కాగా, రాజేష్‌ను హత్య చేసిన తర్వాత పూజ, ఇమ్రాన్‌ కలిసి అతడి మృతదేహాన్ని వేరే చోటుకు తరలించి పడేశారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తన భర్త రాజేష్‌ కనిపించడంలేదని పూజ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేష్‌ నివసించే ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

మరోవైపు మిస్సింగ్‌ ముందు రోజు ఇమ్రాన్‌, పూజతో కలిసి రాజేష్‌ బైక్‌పై వెళ్లడాన్ని ఫుటేజ్‌లో పోలీసులు గమనించారు. పూజ, ఆమె ప్రియుడు ఇమ్రాన్‌ను అనుమానించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో రాజేష్‌ను తామే హత్య చేసినట్లు వారిద్దరూ ఒప్పుకున్నారని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో పూజ, ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు.