చేపల పులుసు చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దీనిని సరైన విధానంలో వండితే దాని రుచి స్వర్గానికి బెత్తెడే దూరం అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇళ్లల్లో అమ్మలు, అమ్మమ్మలు పెట్టే చేపల పులుసు చాలామంది పిల్లలకు ఫేవరెట్ డిష్.
ఈరోజు మనం చేపల పులుసును అద్భుతంగా ఎలా తయారుచేయాలో చూద్దాం.
చేపల పులుసు పెట్టడానికి కావలసిన పదార్థాలు
చేపలు- ఒక కిలో శుభ్రం చేసిన మొక్కలు
చింతపండు- ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకున్న రసం
పసుపు ఆఫ్ స్పూన్
ఉప్పు- మూడు స్పూన్లు
కారం- మూడు స్పూన్లు
అల్లం వెల్లిగడ్డ పేస్టు- ఒక స్పూను
జీలకర్ర మెంతుల పొడి- ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- మూడు
పచ్చిమిరపకాయలు- ఆరు
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలను కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గి రంగు మారిన తర్వాత చల్లారనివ్వాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను, కొత్తిమీర కూడా కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చేపల పులుసు పెట్టుకోవడానికి వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి.
చేపల పులుసులో ఉప్పు, కారం ఇలా
అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి, మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను నూనె వేడి అయిన తర్వాత వేయాలి. ఆపై అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ను వేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు ఆఫ్ స్పూన్, ఉప్పు మూడు స్పూన్లు, కారం మూడు స్పూన్లు వేసి కాసేపు బాగా కలుపుతూ ఫ్రై కానివ్వాలి. ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి.
చేపల పులుసులో పులుపు ఇలా
అయితే ఉప్పు, కారం బాగుంటేనే పులుసు రుచి వస్తుంది. తరువాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో యాడ్ చేయాలి. చిక్కదనం, పులుపు, కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్లను యాడ్ చేసుకోవాలి. పులుసు ఒక తెర్లు వచ్చేవరకు మరగనివ్వాలి. అనంతరం చేప ముక్కలను ఒకటొకటిగా పులుసులో వేసుకోవాలి. ఆపై మూతపెట్టి సన్న సెగ మీద పులుసును మరగనివ్వాలి.
ఇలా చేస్తే చేపల పులుసు సూపర్
అందులో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి మరొకమారు కొద్దిగా పులుసును కలిపి మూత పెట్టుకోని మరిగించుకోవాలి. చేప ముక్క బాగా ఉడికి, పులుసు కాస్త చిక్కదనానికి వచ్చింది అనగా స్టవ్ ఆఫ్ చేసి చేప ముక్కలను కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇక వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఇక ఈరోజు వండిన చేపల పులుసును రేపు ఉదయం తింటే గిన్నెను కూడా శుభ్రంగా ఊడ్చి తినాల్సిందే. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.



































