ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు

www.mannamweb.com


ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు

Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. అలాగే 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. ఒకవేళ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్‌ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది.

పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా నెల మొదటి రోజు ((1వ తేదీ)) ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ఆ రోజున ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఆ ముందు రోజు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న కూడా అదే జరిగింది.. ఆ రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేశారు. అయితే ఆగస్టు 31న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో వర్షాలు పడటంతో రెండు, మూడు రోజులు గడువును పెంచారు. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) ఆదివారం, సెలవు దినం అయితే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్ నెలకు రూ.వెయ్యి (గతంలో రూ.3వేలును రూ.4వేలకు పెంపు) పెంచారు.. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కలిపి జులై నెలలో రూ.7వేలు పింఛన్ అందజేసింది. అంతేకాదు పింఛన్ పంపిణీని దాదాపు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు.. అంటే దాదాపు 97శాతం నుంచి 99శాతం వరకు పూర్తి చేస్తున్నారు. అలాగే గతంలో వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగలతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వాలంటీర్లు లేకపోయినా సరే విజయవంతంగా పింఛన్లను ఇంటింటికి పంపిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏదైనా నెలలో 1వతేదీ సెలవు దినం వస్తే.. ఒకరోజు ముందుగానే డబ్బుల్ని పంపిణీ చేస్తారు.