వాళ్లు తండ్రీ కొడుకులు. స్కూల్ అసిస్టెంట్లు. అందులోనూ ఒకటే స్కూల్. ఈ అరుదైన ఘటనకు వేదికైంది చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ తండ్రీ కొడుకులు మునగల రవీంద్రుడు, హరిప్రసాద్.
వీరికి తిరుపతి రూరల్ ఓటేరు శ్రీవారినగర్. ఇప్పటికే రవీంద్రుడు తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈయన కుమారుడు ఇటీవల జరిగిన డీఎస్సీ ద్వారా ఫిజికల్ సైన్స్ టీచర్ (స్కూల్ అసిస్టెంట్)గా ఉద్యోగం సాధించారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో హరిప్రసాద్ చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పోస్టింగ్ పొందారు. తండ్రి పనిచేస్తున్న పాఠశాలలోనే సోమవారం విధుల్లో చేరారాయన. ‘ఉపాధ్యాయ ఉద్యోగం రావడమే అదృష్టమనుకుంటే.. మా నాన్నతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇది శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీర్వాదమే. ఉపాధ్యాయుడినై మా నాన్న కలను నెరవేర్చే అవకాశాన్ని మెగా డీఎస్సీ ద్వారా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కల్పించారు. మా నాన్న అడుగుజాడల్లో నడిచి.. మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకుంటా. విద్యార్థుల ఉన్నతికి కృషిచేస్తా’ అని హరిప్రసాద్ ఆనందంగా చెప్పారు.
































