AP Govt Employees : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వారి అకౌంట్లలో జమ చేస్తుంది.
ఉద్యోగుల జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జీఎల్ఐ, జీపీఎస్ బకాయిలు జమ అవుతున్నాయి.
మొత్తం రూ. 6,200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థికశాఖ తెలిపింది. ఖాతాల్లో బకాయిలు జమ అవుతున్నాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు తెలిపారు.
రూ.6200 కోట్లు విడుదలకు ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు రూ. 6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని సీఎం ఆర్థికశాఖను ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఉద్యోగుల ఖాతాల్లో సోమవారం నుంచి నిధులు జమ అవుతున్నాయి. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల ప్రక్రియ చేపట్టింది. జనవరిలోనూ రూ.1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తుండడతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
రూ.25 వేల కోట్లకు చేరిన బకాయిలు!
వైసీపీ ప్రభుత్వంలో హయాంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు రూ.25,000 కోట్లకు చేరినట్లు అంచనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో వివిధ బకాయిల కింద రూ.1033 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ.6,200 కోట్లను చెల్లింపు ప్రక్రియ మొదలైంది.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల కోసం రూ.6,200 కోట్లను విడుదల చేయాలని శుక్రవారం ఆర్థికశాఖను ఆదేశించారు. బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.