రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి రెండు నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ సమావేశాలను నిర్వహిస్తుందని మనందరి తెలిసిందే. అయితే ఈ సారి ఇవి ఏప్రిల్ 7 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించాయి. అయితే ఆర్బీఐ కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎక్కువగా ఫోకస్ కొనసాగుతుండటంతో ప్రజలు సైతం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
రానున్న నెలలో కూడా వరుసగా రెండవసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ ఆర్థిక నిపుణులతో నిర్వహించిన పోల్ చెబుతోంది. దీని తర్వాత ఈ ఏడాది ఆగస్టులో మరోసారి చివరిగా వడ్డీ రేట్ల కోతలు ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ఠానికి చేరుకుని 3.61 శాతంగా ఫిబ్రవరిలో నమోదు కావటంతో రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఇది సహాయపడనుంది. అయితే మరోపక్క ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 6.4 శాతం వృద్ధి రేటుతో కొంత మందగమనంలో కొనసాగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు రిజర్వు బ్యాంకుకు కొంత మేర వడ్డీ రేట్లను కత్తిరించటానికి అనువైన అవకాశాన్ని ఇవ్వనున్నాయి.
రాయిటర్స్ నిర్వహించిన పోల్ లో పాల్గొన్న 60 మంది ఆర్థిక నిపుణుల్లో దాదాపు 54 మంది ఈసారి ఎంపీసీ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గింపును ఆశిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం ఒక్క నిపుణుడు మాత్రం 50 పాయింట్ల తగ్గింపును ఆశిస్తున్నట్లు చెప్పారు. చాలా కాలంగా కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక వ్యవస్థలో డబ్బు సర్కులేషన్ తగ్గటంతో ప్రజల వినియోగం తగ్గిందనే వాదనలు ఉన్నాయి. ఇది పడిపోయిన రియల్టీ, తగ్గిన పెట్టుబడుల రూపంలో కూడా మందగమనాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతం వద్ద ఉండగా.. అది ఏప్రిల్, ఆగస్టు తగ్గింపులతో నెమ్మదిగా 5.75 శాతానికి చేరుకోవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి రిజర్వు బ్యాంక్ తన రెపో రేట్ల తగ్గింపును ప్రకటించటం వల్ల వివిధ రుణాల చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారు. రెపో రేటు తగ్గింపుతో దీనికి అనుసంధానించబడిన రుణాల వడ్డీ రేట్లు తగ్గటంతో చెల్లించాల్సిన ఈఎంఐలు తగ్గుతాయి. ప్రధానంగా కార్ లోన్స్, హోమ్ లోన్స్ కలిగిన రుణగ్రహీతలపై రుణ భారం తగ్గుతుంది. అయితే దీనిని ఈఎంఐ నెలవారీ చెల్లింపులు తగ్గించుకోవటం లేదా చెల్లించాల్సిన ఈఎంఐ అలాగే ఉంచి లోన్ కాలాన్ని తగ్గించుకోవటం అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉంచాయి. రిజర్వు బ్యాంక్ ప్రకటించే రేటుకు అనుగుణంగానే పర్సనల్ లోన్స్ రేట్లతో పాటు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆఫర్ చేసే వడ్డీ వంటివి కూడా మారిపోతుంటాయి.