ఏప్రిల్‌ 1 నుంచి మార్పులు: కొత్త పన్ను శ్లాబులు.. యూపీఐ, క్రెడిట్‌ కార్డు రూల్స్‌

మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, కొత్త శ్లాబులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలూ మారనున్నాయి. ఆ వివరాలు ఇవీ..


రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌
ఆదాయపు పన్నుకు సంబంధించి ఇటీవల బడ్జెట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించారు. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేకుండా వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, రూ.25 వేలుగా ఉన్న రిబేట్‌ను రూ.60 వేలకు పెంచారు.

టీడీఎస్‌, టీసీఎస్‌ మార్పులు
ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారికి) జమయ్యే వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే.. దానిపై మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు.
విదేశీ చెల్లింపులు (లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌-ఎల్‌ఆర్‌ఎస్‌) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే టీసీఎస్‌ (మూలం వద్ద పన్ను) వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.10 లక్షలకు పెరిగింది. బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని, ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్‌ ఉండదు.
క్రెడిట్‌ కార్డు రూల్స్‌
క్రెడిట్‌ కార్డులపై రివార్డుల్లో ఎస్‌బీఐ కార్డ్స్‌ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్‌ బుకింగ్‌లపై లభించే రివార్డులను కుదించింది. ఎస్‌బీఐ సింప్లీక్లిక్‌ క్రెడిట్‌ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ ప్లాటినమ్‌ కార్డు, ఎయిరిండియా ఎస్‌బీఐ సిగ్నేచర్‌ కార్డు హోల్డర్లకు వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడనుంది. పూర్తి వివరాలు
ఎయిరిండియాలో విస్తారా విలీనం నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా విస్తారా క్రెడిట్‌ కార్డు రివార్డులను ఏప్రిల్ 18 నుంచి సవరించనుంది. ఆ తేదీన, లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్‌ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలూ వర్తించవు. దీంతో పాటు కొన్ని ప్రయోజనాల్లోనూ కోత పడనుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్‌ అయ్యే విస్తారా కార్డులకు వార్షిక రుసుము తొలగించింది.
ఆ నంబర్లకు యూపీఐ సేవలు బంద్‌
ఇన్‌యాక్టివ్‌ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్‌ నంబర్లకు ఏప్రిల్‌ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్‌ సేవలందించే ప్రొవైడర్లకు.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు
యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో లోడ్‌ చేసిన మొత్తాలను మళ్లీ బ్యాంక్‌ అకౌంట్‌కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ గతంలో సూచించింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే, యూపీఐ లైట్‌ వినియోగించాలంటే ఇకపై యాప్‌ పిన్‌, పాస్‌కోడ్‌, బయోమెట్రిక్‌ వంటివి వినియోగించాల్సి ఉంటుంది.
యులిప్స్‌కు ట్యాక్స్‌: యులిప్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. 2025 బడ్జెట్‌లో ఈ మార్పును ప్రతిపాదించారు.

వాత్సల్యకు పన్ను ఊరట: పిల్లల భవిష్యత్‌ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్‌ 80సీసీడీ (1బి) కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే