సమంత రూత్ ప్రభు భర్త రాజ్ నిడిమోరుతో తొలి సంక్రాంతి జరుపుకుంది. కారులో వెళ్తూ ఓ క్యూట్ సెల్ఫీ తీసుకున్న ఆమె.. దానిని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ కావడంతో సామ్ దీనిని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త, ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఈ పండగను జరుపుకుంటూ ఆనందంలో మునిగితేలింది.
ఎరుపు రంగు దుస్తుల్లో.. చిలిపి పోజుల్లో..
గురువారం (జనవరి 15) నాడు సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అభిమానులకు ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. కారులో ప్రయాణిస్తూ భర్తతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరూ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు.
రాజ్ కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తుండగా.. సమంత మాత్రం మూతి ముందుకు పెట్టి చాలా కొంటెగా ఫోటోకి పోజులిచ్చింది. “సంక్రాంతి వైబ్స్” అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. పెళ్లి తర్వాత సామ్ ఎంత సంతోషంగా, ఉల్లాసంగా ఉందో చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం.
వైరల్ అవుతున్న ఎయిర్పోర్ట్ లుక్
కొద్ది రోజుల క్రితమే ఈ కొత్త జంట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చిక్కింది. ఆ సమయంలో సమంత స్టైలిష్ లుక్తో పాటు, ఆమె మెడలో మెరుస్తున్న మంగళసూత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్ లో కనిపించారు. పెళ్లి తర్వాత వీళ్లు కలిసి కనిపించడం అదే తొలిసారి. అప్పుడు కూడా ఆమె తెల్ల చీర కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.
కొత్త జీవితం.. కొత్త ఆశలు
గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో సమంత, రాజ్ నిడిమోరు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పోర్చుగల్లోని లిస్బన్కు హనీమూన్ వెళ్లారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్టుల ద్వారా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. 2021లో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత, సామ్ మళ్లీ రాజ్ రూపంలో తోడును వెతుక్కుంది.
ప్రస్తుతం ఈ జంట వృత్తిపరంగానూ బిజీగా ఉంది. రాజ్ & డీకే దర్శకత్వంలో రాబోతున్న భారీ పీరియాడిక్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’లో సమంత నటిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

































