Tadepalli SIT Office papers burned: సీక్రెట్‌గా పేపర్లు దహనం, హెరిటేజ్‌కి చెందినవా?

Tadepalli SIT Office papers burned: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తాజాగా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌‌లో పేపర్లు తగలబడడం తీవ్ర కలకలం రేపుతోంది. తగలబడుతున్న వాటిలో పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆఫీసు పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది.


ముఖ్యంగా సిట్ కార్యాలయ సిబ్బంది పలు పత్రాలు దహనం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. హెరిటేజ్ సంస్థకు చెందిన పేపర్లుగా చెబుతున్నారు. పత్రాలు తగలబెట్టడంపై స్థానికులు సంబంధి త సిబ్బందిని ప్రశ్నించి వీడియోలు తీశారు. పత్రాలు తగలబెట్టినప్పుడు తీసిన వీడియోలు తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

సిట్ అధిపతి ఆదేశాల మేరకే వ్యక్తిగత సిబ్బంది నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారన్న విమర్శలు జోరందుకున్నాయి. దీనిపై టీడీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హెరిటేజ్ సంస్థకు చెందిన కీలకపత్రాలు ఉండవచ్చని భావిస్తోంది. జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు సిట్ అక్రమ కేసులు పెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించిన పేపర్లు అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. చాన్నాళ్ల కిందట ఓఆర్ఆర్ కేసులో నారా లోకేష్‌ను సీఐడీ విచారించింది. ఈ క్రమంలో హెరిటేజ్ పేపర్స్ చూపించి పలు ప్రశ్నలు సంధించారు అధికారులు. ఆయా పత్రాలు ఎలా వచ్చాయని అధికారులను లోకేష్ ప్రశ్నించినట్టు మీడియా ఎదుట ఆయనే చెప్పారు. కేసుతో సంబంధం లేని పత్రాలను ఇప్పుడు సిబ్బంది తగలబెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీని గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.