ఏపీలో ఎన్నికల తేదీ ఇదే ? అధికారులకు ఈసీ తాజా సంకేతాలు…!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారుల మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై అధికారులతో పలు సమీక్షలు నిర్వహించింది.
రాజకీయపార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. మిగతా రాష్ట్రలతో పోలిస్తే ఏపీలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఉండటంతో ఈసీ కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేతేదీని సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (అసెంబ్లీ మరియు పార్లమెంట్) పోలింగ్ తేదీగా ఏప్రిల్ 16ను డేట్ ఆఫ్ రిఫరెన్స్ గా తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నోట్ పంపింది. ఇందులో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ తేదీని రిఫరెన్స్ గా పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఈసీ సూచించింది. దీంతో ఇప్పుడు అధికారులు ఏప్రిల్ 16వ తేదీని టార్గెట్ గా పెట్టుకుని పనిచేయనున్నారు.
ఏప్రిల్ 16వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించేందుకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకే ఏప్రిల్ 16వ తేదీని హద్దుగా పెట్టుకుని పని చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో ఏపీలో పర్యటించిన సందర్భంగా రాజకీయ పార్టీలు ఈసీని ఎన్నికల తేదీపై ఆరా తీశాయి. దీంతో ఎన్నికల సంసిద్ధత కోసం ఏప్రిల్ 16ను టార్గెట్ గా పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు అధికారులకు జారీ చేసిన నోట్ లోనూ అదే విషయం పేర్కొనడంతో దాదాపుగా ఇదే ఏపీలో ఎన్నికల తేదీ కావచ్చని తెలుస్తోంది.