పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
“పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి, డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు” అని కిరణ్ రిజిజు తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది.
































