గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవదానానికి ఓ కుటుంబం ముందుకు వచ్చింది. తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సొంత ఖర్చులతో అవసరమైన ఏర్పాట్లు చేశారు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్డెడ్ అయింది. ఆమె కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. తక్షణమే స్పందించిన లోకేశ్.. బ్రెయిన్డెడ్ అయిన మహిళ గుండెను తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆస్పత్రికి గుండె చేరే వరకు గ్రీన్ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. మంత్రి నారా లోకేశ్కు మహిళ కుటుంబసభ్యులు, రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.