పొలం దున్నుతుండగా.. రైతుకి ధగధగా మెరుస్తూ కనిపించిన రాయి.. దగ్గరకెళ్లి చూడగా.!

శాసనాలు చరిత్రకు ఆనవాళ్లు.. ఆ కాలంలో రాజులు, దాతలు రాయించిన శాసనాలు మన చరిత్ర, సమాజం, సంస్కృతిని తెలియచేస్తాయి. క్రీస్తు శకం ప్రారంభంలో ఎక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో..
తెలియ చెప్పేందుకు ప్రత్యేకంగా గ్రంధస్థం చేసే వ్యవస్థలేని సమయంలో ఈ శాసనాలే ఆనాటి చరిత్రకు ఆనవాళ్లగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి చరిత్రకు ఆనవాళ్లుగా భావించే శాసనాలు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా తెలుగు లిపిలో బయటపడుతున్నాయి. అలాంటి వాటిలో తాజాగా మరో తెలుగుశాసనం బయటపడింది. ప్రకాశం జిల్లా బాపనపల్లిలో 8వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి పొలాల్లో బయటపడింది.


వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదవ శతాబ్ధం నాటి మరో తెలుగు శాసనం లభ్యమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బాపనపల్లి సమీపంలోని పొలాల్లో ఓ రాయి రైతులకు కనిపించింది. అయితే దానిపై తెలుగు అక్షరాలు లిఖించి ఉండటంతో ఏదో గుప్తనిధికి సంబంధించిన వివరాలు ఉన్నాయేమో అన్న ఆసక్తితో స్థానికులు చరిత్ర పరిశోధకుడిగా ఉన్న తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌కు సమాచారం అందించారు. దీనిని పరిశీలించిన ఆయన వీటి ఫోటోలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కె. మునిరత్నంకు పంపించారు. దీన్ని పరిశీలించిన మునిరత్నం ఈ రాతిపై లిఖించింది శాసనంగా గుర్తించారు. 8 – 9 శతాబ్దాల కాలంలో ఈ శాసనంపై లిఖించినట్టుగా భావిస్తున్నారు. దీనిపై 8వ శతాబ్దపు కాలం నాటి తెలుగు అక్షరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ శాసనంలో మకరద్వజ అను బిరుదును కలిగిన శ్రీ త్రిపురాంతకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు రాయించినట్టుగా భావిస్తున్నారు. కైలాస భగవంతుడిగా కీర్తించబడిన శ్రీ ఉమరవెయిధీశ్వర దేవుడికి దండియమ్మ అను ఆమె ” పన్నాస ” అనే భూమి, ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో రాసి ఉంది.

బాపనపల్లికి సమీపంలో అయ్యంబొట్లపల్లి గ్రామంలో రామలింగేశ్వరస్వామివారి గుడిలో కూడా ఇలాంటి అక్షరాలతో కూడిన శాసనం, అలాగే గోళ్ళవిడిపిలో గ్రామంలో కూడా ఇదే తరహా లిపితో ఉన్న మరో శాసనం కూడా గతంలో బయటపడినట్టు చెబుతున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాసేవారు.. ఆ తరువాత రేనాటి చోళుల కాలంలో తెలుగులో శాసనాలు వేయడం ప్రారంభించారు.