మహాకుంభమేళాలో విచిత్రాలు జరుగుతున్నాయి. అక్కడకు కుటుంబంతో సహా వచ్చి పుణ్యస్నానాలు చేసే వాళ్లు కోట్ల మంది ఉన్నారు.
అదే సమయంలో సాధువులు, నాగ సాధువులు పెద్ద ఎత్తున వచ్చి పుణ్యస్నాలు చేసి పోతున్నారు. వీరంతా అన్నీ వదిలేసి వచ్చి సాధువుల్లో చేరి అఘోరాలుగా మారిపోయిన వారే. వారికి కుటుంబసభ్యులు ఉంటారు. వారు వదిలేసినా.. ఆ కుటుంబసభ్యులు మాత్రం తమ కుటుంబ పెద్ద ఎక్కడైనా ఉంటాడు కదా వెదుక్కుంటూ ఉంటారు.
కుంభమేళాకు జార్ఖండ్ నుంచి ఓ కుటుంబం వెళ్లింది. పుణ్యస్నానాలు చేసి గుళ్లూ గోపురాలు తిరుగుతుంటే ఓ చోట ఓ అఘోరి బాబా కనిపించాడు. అతన్ని ఎక్కడో చూసినట్లుగా ఉందని వారికి అనిపించింది. చివరికి అతను ఇరవై ఏడేళ్ల కిందట కనిపిచంకుండా పోయిన తమ సమీప బంధువు గంగసాగర్ యాదవ్ గా గుర్తించారు. అయితే ఆ విషయాన్ని ఆయనకు చెప్పకుండా ఓ కంట కనిపెడుతూ…జార్ఖండ్ లోని అతని భార్యకు సమాచారం ఇచ్చారు.
గంగసాగర్ యాదవ్ చెప్పా పెట్టకుండా ఇద్దరు పిల్లల్ని, భార్యను వదిలేసి ఇరవై ఏడేళ్ల కిందట వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం చాలా తిరిగారు కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి కేసులు కూడా పెట్టారు. అయినా ఎక్కడా కనిపించలేదు.దాంతో పిల్లల్ని ఆమె పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు భర్త సన్యాసుల్లో కలిసిపోయాడని అఘోరిగా మారి కుంభమేళాకు వచ్చాడని తెలియడంతో పిల్లల్ని తీసుకుని వెంటనే కుంభమేళాకు వెళ్లింది. అక్కడ బంధువులు గంగసాగర్ యాదవ్ ను చూపించారు.
ఆమె భర్తను గుర్తు పట్టింది. అఘోరిగా మారి గడ్డాలు పెంచుకున్నా భర్తను గుర్తు పట్టిన ఆమె కన్నీరు పెట్టుకుంది. అయితే అఘోరి మాత్రం ఆమె ఎవరో తెలియనట్లుగా వ్యవహించారు. వారెవరో తెలియదని..పిల్లలు కూడా తెలియనట్లే ఉన్నారు. అసలు తనకు జార్కండ్ తో సంబంధం లేదని తనది వారణాశి అని చెప్పుకొచ్చాడు. కానీ ఆ భార్య గంగసాగర్ యాదవ్ కు ఎప్పుడెప్పుడు దెబ్బలు తగిలాయో.. దెబ్బల గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పింది. అవన్నీ సరిపోలాయి. అయితే అతను మాత్రం అంగీకరించలేదు. తాను వారు చెబుతున్న వ్యక్తిని కాదని అంటున్నాడు. కానీ ఆ కుటుంబం వదిలి పెట్టడం లేదు. కావాలంటే డీఎన్ ఏ టెస్టుకు రెడీ అంటున్నారు. ఈ వ్యవహారం కుంభమేళా అధికార వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.