Museum: నాలుగేళ్ల బాలుడి ఉత్సుకత.. ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ

www.mannamweb.com


Museum: నాలుగేళ్ల బాలుడి ఉత్సుకత.. ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ

మూడు వేల ఏళ్లనాటి ఓ కళాఖండం నాలుగేళ్ల చిన్నారి ఉత్సుకతకు ముక్కలైన ఘటన ఇజ్రాయెల్‌ మ్యూజియంలో చోటుచేసుకుంది.

అద్భుత కళాఖండాలు, ప్రాచీన సంపదకు నెలవైన మ్యూజియంలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. అందుకే అందులో వస్తువులను అత్యంత జాగ్రత్తగా ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. ఈ క్రమంలో 3వేల ఏళ్లనాటి ఓ కళాఖండం నాలుగేళ్ల చిన్నారి ఉత్సుకతకు ముక్కలైంది. ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజియంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న హిచ్‌ మ్యూజియంలో కాంస్య యుగానికి చెందిన అనేక కళాఖండాలున్నాయి. వీటిలో చెక్కుచెదరకుండా ఉన్న ఓ జాడీకి అరుదైన కళాఖండంగా గుర్తింపు ఉంది. ప్రత్యేక ఆకర్షణగా ఉన్న దీనిని మ్యుజియం ప్రవేశ మార్గంలో ఉంచారు. మ్యూజియం సందర్శనకు అలెక్స్‌, తన నాలుగేళ్ల బాలుడితో వచ్చాడు. ఈ క్రమంలో ఉత్సాహంతో అందులో ఏముందని ఆ బాలుడు తొంగి చూశాడు. దాంతో అది కిందపడి ముక్కలైంది.

పగిలిపోయిన ఆ కళాఖండం పక్కన బాలుడు నిలబడి ఉండటం చూసి అలెక్స్‌ షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడు దాన్ని పడేయలేదని తొలుత పేర్కొన్నాడు. కానీ, తానే పడేశానని బాలుడు చెప్పడంతో ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల అనంతరం.. మ్యూజియం ఆహ్వానం మేరకు బాలుడితోపాటు అలెక్స్‌ మళ్లీ అక్కడకు వచ్చాడు. తిరిగి దానిని అతికించి ఉండటంతో అలెక్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కోసారి ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తుంటారని.. కానీ, ఈ విషయం భిన్నమని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. బాలుడు ప్రమాదవశాత్తు పడేశాడని చెప్పారు.