ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్టులు, అనుబంధ పరిశ్రమలతో లక్షల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం దీని సొంతం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి..
ఉపాధి అవకాశాలు సృష్టించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఉన్న పోర్టులకు మరిన్ని వసతులు కల్పిస్తోంది. కొత్త పోర్టులు కూడా నిర్మిస్తోంది. వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోర్టుల నెంబడి 8 కొత్త పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, రాంబిల్లి, మూలపేట, దుగరాజపట్నం, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో అభివృద్ది చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
8 కొత్త నగరాలు..
ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించబోయే పోర్టుల అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోర్టుల నుంచి 100 కిలోమీటర్లల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను మారిటైం బోర్డు ఇప్పటికే సిద్ధం చేసింది. ఆ పరిధిలో పరిశ్రమలకు అవసరమయ్యే గోదాములు, నివాస ప్రాంతాలు, కార్యాలయ స్థలం వంటి తదితర ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా.. జోన్లుగా విభజించింది. ఈ జోన్ల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ నగరాలను అభివృద్ధి చేయడం కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో మారిటైం బోర్డు ప్రణాళికలు రూపొందించింది.
పోర్టుల సమీపంలో జరిగే కార్యకలాపాలకు అనుగుణంగా ఆయా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. క్లస్టర్ల అభివృద్ధితో పాటు పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో ఉన్న గ్రామాలను కలుపుకుని నగరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నగరాలకు కావాల్సిన మౌలికసదుపాయాల నిర్మాణానికి.. సాగరమాల 2.0 నిధులు ఉపయోగించుకునేలా ప్రణాళికలు తయారు చేస్తోంది.పారిశ్రామిక క్లస్టర్లు..
ఇప్పటికే ఉన్న విశాఖ పోర్టు సమీపంలో సముద్ర ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక మూలపేట పోర్టు సమీపంలో రసాయన పరిశ్రమలు, వాటికి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే యూనిట్ల క్లస్టర్, రాంబిల్లిలో నిర్మిస్తున్న పోర్టు సమీపంలో రక్షణరంగ పరిశ్రమల క్లస్టర్, కాకినాడ పోర్టు సమీపంలో పెట్రోలియం ఆయిల్, లూబ్రికెంట్స్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక మచిలీపట్నంలో హెవీ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన క్లస్టర్తో పాటు రామాయపట్నం, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం వంటి పోర్టుల సమీపంలో.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.రూ.10,522 కోట్లతో పనులు..
ఆయా పోర్టుల సమీపంలో ఈ పారిశ్రామిక నగరాల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రూ.10,522.90 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు రూ.50 కోట్లు, నీటి సరఫరాకు రూ.50 కోట్లు.. పోర్టు పరిధిలో అభివృద్ధికి రూ.2,089.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.1,376.62 కోట్లు, మూలపేట పోర్టు పరిధిలో రూ.6,742.80 కోట్లు, రామాయపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు రూ.220 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. సాగరమాల 2.0 కింద ఈ ప్రాజెక్టులు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

































