స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్ టాప్ అనగానే ఒకింత ఆశ్చర్యానికి గురికావచ్చు.. కానీ ఇది అక్షరలా నిజం.. త్వరలోనే స్క్రీన్‌లు లేని ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి.


సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయడానికి మూలం స్కీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్క్రీన్‌లోనే చూసేందుకు వీలవుతుంది. అలాంటిది స్క్రీన్ లేకుండా ల్యాప్‌టాప్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. మూడేళ్లు కష్టపడి అసలు స్క్రీన్ లేకుండా పనిచేసే ల్యాప్‌టాప్‌ను సైట్‌ఫుల్ కంపెనీ సిద్ధం చేసింది. సైట్‌ఫుల్ సంస్థ కృషి ఫలితం ఏఆర్ గ్లాసెస్ సహాయంతో 100 అంగుళాల వర్చువల్ డిస్‌ప్లేను చూపించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎఆర్ ల్యాప్‌టాప్‌ను సైట్‌ఫుల్ కంపెనీ సిద్ధం చేసింది. స్పేచ్‌టాప్ జీ1 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.

స్క్రీన్‌ లేని ల్యాప్‌టాప్‌లో ఫీచర్లు..

సైట్‌ఫుల్ స్పేచ్‌టాప్ జీ1 ల్యాప్‌టాప్ వంద అంగుళాల వర్చువల్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇది పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్, 128 జీబీ డేటా స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం, ఈ ల్యాప్‌టాప్‌లో రెండు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు, Wi-Fi 7, 5G (నానో-సిమ్, ఇ-సిమ్ సపోర్ట్), బ్లూటూత్ వెర్షన్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌లో 60Wh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే బ్యాటరీ 8 గంటల పాటు ఉపయోగించవచ్చు.

ధర ఎంతంటే..

ఎఆర్ టెక్నాలజీతో పనిచేసే సైట్‌ఫుల్ స్పేచ్‌టాప్ జీ1 ల్యాప్‌టాప్ ధరను కంపెనీ 17వందల డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో దీని ధర రూ.1,42,035 రిటైల్ మార్కెట్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర 1900 డాలర్లుగా ఉండొచ్చు. భారత కరెన్సీలో ధర రూ.1,58,745 పలకనుంది. మొదట 100 డాలర్లు చెల్లించి ఈ ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమెరికాలో ఈ ల్యాప్‌టాప్‌ల డెలివరీ ప్రారంభం కానుంది.