శునకానికి అరుదైన గుండె శస్త్రచికిత్స

సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి దిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి.


దిల్లీ: సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక శునకానికి దిల్లీలోని పశువైద్య నిపుణులు కోతలేని గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఈ తరహా శస్త్రచికిత్సను నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఏడేళ్ల వయసున్న జూలియట్‌ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్‌ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కుక్కల్లో వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80 శాతంగా ఉంది. దీనివల్ల గుండె ఎడమ ఎగువ గదిలో రక్తప్రవాహం వెనక్కి మళ్లుతుంది. ఈ వ్యాధి ముదిరేకొద్దీ ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగిపోతుంది. క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమస్య ఉన్న జూలియట్‌కు దిల్లీలోని మ్యాక్స్‌ పెట్జ్‌ ఆసుపత్రి నిపుణులు.. ట్రాన్స్‌కెథతర్‌ ఎడ్జ్‌-టు-ఎడ్జ్‌ రిపెయిర్‌ (టీఈఈఆర్‌) అనే ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు.

శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి దీన్ని చేపట్టారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను పూర్తిచేశారు. గత నెల 30న ఈ శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.